కరోనా ఎఫెక్ట్: భారీగా పెరుగుతున్న లాప్టాప్ సేల్స్... ధరల మంట!
కరోనా వైరస్ మన జీవితాల్లో చాలా మార్పు తెచ్చిందని చెప్పాలి. చైనా లో మొదలైన ఈ మాయదారి మహమ్మారి ప్రాణాంతకం కావటంతో ప్రపంచం మొత్తం వణికిపోయింది. సుమారు 70 లక్షల మందికి సోకిన ఈ వైరస్ ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. అందుకే, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్ డౌన్ విధించాయి.
కానీ నెలలు గడుస్తున్నా వైరస్ సోకిన వారి సంఖ్య తగ్గకపోగా పెరిగిపోతుండటం... అలాగే ఆర్థిక వ్యవస్థలు చితికిపోతుండటంతో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఇది గమనించిన ప్రభుత్వాలు వైరస్ ను ఎదుర్కొనేందుకు ఎవరికీ వారే సొంత చర్యలు తీసుకుంటూ, జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాయి. దీంతో ప్రజలు మళ్ళీ తమ పనులు ప్రారంభిస్తున్నారు.
కానీ ఈ మధ్య అందరూ డిజిటల్, ఆన్లైన్ లో పనులు పూర్తి చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు ఆన్లైన్ క్లాస్ లు మొదలు పెట్టాయి. అలాగే చాలా ఆఫీస్ లు వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తున్నాయి. దీంతో దేశంలో ఒక్కసారిగా లాప్టాప్ లు, ఇంటర్నెట్ కనెక్షన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
ఆర్థికమాంద్యంలోకి ప్రపంచం, జాగ్రత్త పడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు!
ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రొం హోమ్...
స్కూల్స్, కాలేజీ లు మళ్ళీ ప్రారంభం అయినప్పటికి... కొంత పోర్షన్ ఆన్లైన్ లో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా ఇంటి నుంచి పనిచేసే అన్ని రకాల పనులకు వర్క్ ఫ్రొం హోమ్ అమలు చేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు కేవలం ఆఫీస్ లాప్టాప్ లు వినియోగిస్తున్న వారు కొత్తగా సొంత లాప్టాప్ లు కొనుగోలు చేస్తున్నారు.
ఇక పోతే పిల్లల ఆన్లైన్ క్లాసుల కోసం పేరెంట్స్ కూడా లాప్టాప్ లు కొంటున్నారు. దీంతో ఒక్క సారిగా లాప్టాప్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు లాక్ డౌన్ వల్ల రెండు నెలలుగా కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వారు కూడా ఇప్పుడు ఒక్కసారిగా కంప్యూటర్, లాప్టాప్ షాపులకు క్యూ కడుతున్నారు. లాక్ డౌన్ ముందు పరిస్థితి తో పోల్చి చూస్తే 100-200 శాతం డిమాండ్ అధికంగా ఉన్నట్లు రిటైలర్లు చెబుతున్నారు.
పెరుగుతున్న ధరలు...
ఒక్కసారిగా పెరుగుతున్న డిమాండ్ ను కాష్ చేసుకునేందుకు రిటైలర్లు ధరలు పెంచేస్తున్నట్లు సమాచారం. దీంతో సాధారణ పరిస్థితుల్లో దొరికే ధరలతో పోల్చితే ఒక్కో లాప్టాప్ పై కనీసం రూ 4,000 నుంచి రూ 5,000 వరకు అధిక ధర పడుతున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. అయితే, రిటైలర్ల మాట మాత్రం మరోలా ఉంటోంది.
ధరలు పెరగలేదు కానీ డిస్కౌంట్లు తగ్గటం వల్ల ఆ ప్రభావం వినియోగదారులపై పడుతోందని అంటున్నారు. దెబ్బ తాకేందుకు ఏ రాయి అయితే ఏమిటి? కన్సూమర్లకు మాత్రం అధిక ధరల మోత మోగుతుండటం వాస్తవం. దీనికి మరో కారణం కూడా ఉంది. దేశంలో లాప్ టాప్ ల స్టాక్ లు పరిమితంగానే ఉన్నాయి. అవి కూడా సేల్స్ ఇంతే వేగంగా జరిగితే మరో నెల రోజుల్లోపే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
చైనా నుంచి ఇంపోర్ట్స్ నిల్...
ఇండియాలో విక్రయించే లాప్టాప్ లు అన్నీ కూడా చైనా లో తయారైనవే ఉంటాయి. భారత్ లో కొన్ని అసెంబుల్ చేస్తారంతే. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి చైనా నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో మన వద్ద ఉన్న పరిమిత స్టాక్స్ నే విక్రయిస్తున్నారు. మళ్ళీ చైనా నుంచి ఇంపోర్ట్స్ ప్రారంభం అయితే పరిస్థితిలో కొంత మార్పు రావొచ్చని భావిస్తున్నారు.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎప్పుడు జరుగుతుందో చెప్పటం కష్టమని అంటున్నారు. చైనా పై పెరుగుతున్న వ్యతిరేకత కు తోడు ఇటీవల డ్రాగన్ కంట్రీ మన దేశం తో యుద్ధానికి కాలుదువ్వుతుండటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. లడఖ్ లో భారత - చైనా ఆర్మీ మధ్య తోపులాటలు, ముష్టి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దేశంలో ఉన్న పరిమిత స్థాయి స్టాక్స్ నే విక్రయించాలంటే ధరల పెరుగుదల తప్పనిసరి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.