తుడిచిపెట్టుకుపోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు నెట్ వర్త్, షేర్హోల్డర్లకు మిగిలేదేం లేదు!!
ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు(LVB)పై కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నెల రోజుల పాటు తాత్కాలిక మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కాలంలో కస్టమర్లు బ్యాంకు నుండి రూ.25వేలకు మించి ఉపసంహరించుకోలేరు. ఎక్కువ మొత్తం అవసరమైతే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. మారటోరియం కాలం తర్వాత సింగపూర్కు చెందిన డీబీఐఎల్ (డీబీఎస్ బ్యాంకు ఇండియా)లో విలీనం అయ్యే ప్రతిపాదన ఉంది. నిన్న మార్కెట్లు ముగిసిన తర్వాత LVBపై నిర్ణయం వెలువడింది. దీంతో స్టాక్స్ ఈ రోజు 20 శాతం నష్టపోయాయి.
లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభం: డిపాజిటర్లకు షాక్... విత్డ్రా పరిమితి, DBSలో విలీనం!
విలీనంతో ఖాతాదారులు, ఉద్యోగులకు ప్రయోజనం
నవంబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు నెల రోజుల పాటు మారటోరియం అమలులో ఉంటుంది. బ్యాంకు అడ్మినిస్ట్రేటర్గా కెనరా బ్యాంకు మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహర్ను నియమించారు. దేశీయ బ్యాంకింగ్ చరిత్రలో తొలిసారి విదేశీ బ్యాంకుకు చెందిన దేశీయ యూనిట్తో (DBS) దేశీయ బ్యాంకును(LVB) విలీనం చేసేందుకు ఆర్బీఐ ప్రతిపాదించిందని చెబుతున్నారు. ఇందుకు ప్రధానంగా డీబీఎస్ బ్యాంకు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటం, విలీనంతో LVB ఖాతాదారులు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగే వెసులుబాటు ఉండటం వంటి అంశాలను ఆర్బీఐ పరిగణలోకి తీసుకుందని చెబుతున్నారు.
ఆర్థికంగా మద్దతు
సింగపూర్ కేంద్రంగా పని చేస్తోన్న డీబీఎస్ బ్యాంకు ఇండియా విభాగం (DBIL)తో విలీనానికి ఆర్బీఐ ముసాయిదా పథకాన్ని వెలువరించింది. విలీనానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తే భారత్లో తమ అనుబంధ సంస్థ DBIL రూ.2500 కోట్ల మేర నిధులు ఇవ్వనున్నట్లు డీబీఎస్ తెలిపింది. దేశంలో 26 ఏళ్లుగా డీబీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 13 రాష్ట్రాలు, 24 పట్టణాలకు సేవలు విస్తరించింది. LVBకి ఎన్నారై కస్టమర్లు అధికంగా ఉన్నారని, డీబీఎస్ బ్యాంకులో విలీనమైతే ఆసియాలో విస్తరించిన డీబీఎస్ ద్వారా కస్టమర్లకు సులభంగా సేవలు అందుతాయని భావిస్తున్నారు. డీబీఎస్ బ్యాంకులో సింగపూర్ ప్రభుత్వానికి చెందిన టెమ్సెక్ వాటాదారు కావడంతో ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉన్నాయని చెబుతున్నారు.
దక్షిణాదిలో విస్తరణ
డీబీఎస్ బ్యాంకులో LVB విలీనమైతే అవసరమైతే మరిన్ని నిధులతో బ్యాంకు కార్యకలాపాలను విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే డీబీఎస్... జేవీ చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్లో 37.5% వాటాను దక్కించుకుంది. LVBని విలీనం చేసుకుంటే దక్షిణ భారతంలో కార్యకలాపాలు విస్తరించుకునే వెసులుబాటు కలుగుతుంది. LVBకి 563 బ్రాంచీలు, 974 ఏటీఎంలు ఉన్నాయి.
వాటాదారులకు ప్రయోజనం లేదా
డీబీఎస్లో LVB విలీనమైతే ఖాతాదారులకు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల కారణంగా ఖాతాదారులకు పెద్దగా ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. అయితే షేర్లను కొనుగోలు చేసిన వాటాదారులపై కొంత ప్రభావం ఉండవచ్చునని అంటున్నారు. లక్ష్మీ విలాస్ బ్యాంకు నెట్ వర్త్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో వాటాదారులకు నష్టం వాటిల్లడం సహజమేనని అంటున్నారు. సెప్టెంబర్ నాటికి బ్యాంకు కనీస పెట్టుబడుల నిష్పత్తి (CAR) మైనస్ 2.85 శాతానికి పడిపోయింది. మార్చి నుండి టైర్ 1 క్యాపిటల్ ప్రతికూలంగా నమోదవుతోంది. సెప్టెంబర్ క్వార్టర్లో రూ.397 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
ఇదీ బ్యాంకు పరిస్థితి
గతంలో ఆర్బీఐ అనుమతితో ఐడీబీఐ, యునైటెడ్ వెస్టర్న్ బ్యాంకు విలీనం అయ్యాయి. గతంలో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు లిమిటెడ్తో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కలిసింది. తాజాగా క్లిక్స్ గ్రూప్తో విలీనం కోసం LVB ప్రయత్నిస్తోంది. గత ఏడాది ఎన్బీఎఫ్సీ ఇండియా బుల్స్లో విలీనం సక్సెస్ కాలేదు. విలీనంపై అనిశ్చితి కొనసాగుతుండగా బ్యాంకు ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్(GNPAs) 24.45 శాతంగా కొనసాగుతోంది. నికర ఎన్పీఏలు 7.01 శాతంగా ఉంది. బ్యాంకు మూలధనం ప్రమాదకరస్థాయిలో ఉంది. బ్యాంకు టైర్ 1 క్యాపిటల్ రేషియో ప్రతికూలంగా ఉంది. బాసెల్ III గైడ్ లైన్స్ ప్రకారం మొత్తం క్యాపిటల్ తగినంత నిష్పత్తి (CAR) సెప్టెంబర్ 30 నాటికి 2.85 శాతంగా ఉంది. బ్యాంకు బిజినెస్ ఏడాది కాలంగా క్షీణించింది.