LVB crisis: లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి రూ.5 లక్షలు తీసుకోవచ్చు.. ఇలా
ముంబై: లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో ఖాతాదారులకు చిక్కులు వచ్చి పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు మారటోరియం విధించింది. నవంబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 16 వరకు మారటోరియం అమలులో ఉంటుంది. మారటోరియం కాలంలో రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుండి ఎటువంటి రాతపూర్వక అనుమతి లేకుండా డిపాజిటర్లకు రూ.25,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులు చేయడానికి బ్యాంకుకు అనుమతిలేదు. రూ.25,000 కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపు చేయాలంటే బ్యాంకింగ్ రెగ్యులేటర్ అనుమతి తప్పనిసరి. పెళ్లి, వైద్యం వంటి ఖర్చుల కోసం అనుమతితో రూ.25,000 కంటే ఎక్కువ తీసుకోవచ్చు.
డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము ఉంది: లక్ష్మీ విలాస్ బ్యాంకు డిపాజిటర్లకు హామీ
రూ.25కు మించి ఉపసంహరణకు 4 షరతులు
ఆర్బీఐ ఆంక్షల మేరకు లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి రూ.25వేలకు మించి ఉపసంహరించుకునే అవకాశం లేదు. అయితే బ్యాంకు డిపాజిటర్లు రూ.5 లక్షల వరకు నగదును ఉపసంహరించుకునే ప్రత్యేక నిబంధనతో ప్రభుత్వం ఊరట కల్పించింది.
రిజర్వ్ బ్యాంకు సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా లక్ష్మీ విలాస్ బ్యాంకు లిమిటెడ్ డిపాజిటర్లు రూ.25వేలకు మించి నగదును ఉపసంహరించుకోవచ్చు అని ఆర్బీఐ తెలిపింది. అయితే ఉపసంహరణకు సంబంధించి నాలుగు షరతులు ఉన్నాయి.
ఈ 4 సందర్భాల్లో తీసుకోవచ్చు
- డిపాజట్దారు మెడికల్ ట్రీట్మెంట్ కోసం లేదా డిపాజిట్దారుపై ఆధారపడిన వ్యక్తుల వైద్యం కోసం తీసుకోవచ్చు.
- భారత్లో లేదా ఇతర దేశాల్లో అతని కోసం లేదా అతనిపై ఆధాపడిన వారి ఉన్నత చదువుల ఖర్చు కోసం డబ్బులు తీసుకోవచ్చు.
- డిపాజిటర్ లేదా అతని పిల్లలు లేదా అతనిపై ఆధారపడిన వారి పెళ్లి లేదా ఇతర శుభకార్యాల కోసం రూ.25వేలకు మించి తీసుకోవచ్చు.
- ఇతర అనివార్యమైన అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవచ్చు.
ఇతర సందర్భాల్లోను...
ఇతర కొన్ని సందర్భాలలోను రూ.25,000కు మించి నగదు ఉపసంహరణకు అనుమతిస్తారు. అయితే పరిశీలించి, ధృవీకరించిన తర్వాత ఇస్తారు. ఈ అదనపు మొత్తం కూడా రూ.5 లక్షలకు మించరాదు. లేదా డిపాజిట్దారు ఖాతాలో ఉన్న మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటారు.
సంక్షోభం నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంకు స్టాక్ ధర రెండు రోజుల్లో 40 శాతం పడిపోయింది. నేడు 20 శాతం క్షీణించి రూ.10 వద్ద ట్రేడ్ అయింది.