ఇక్కడకు రండి... ఎలాన్ మస్క్కు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్కు ఆహ్వానం పలికారు. తమ రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పని చేయడానికి సంతోషిస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందు ఉందని, భారత్లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా తెలంగాణ ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
జర్నలిస్ట్ ఏమన్నారంటే
కేటీఆర్ ట్వీట్ పైన నెటిజన్లు స్పందించారు. ప్రముఖ జర్నలిస్ట్ సుచేతా దలాల్ స్పందించారు. టెస్లాను కేటీఆర్ ఆహ్వానించడం ఇంటరెస్టింగ్ మూవ్ అన్నారు. గతంలో నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నప్పుడు టాటా మోటార్స్కు రెడ్ కార్పెట్ పరిచారని, ఆ తర్వాత జయలలిత ఫోర్డ్, హ్యుండాయ్లను ఆహ్వానించడంతో లక్ష ఉద్యోగాలు వచ్చాయని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఐఎస్బీHYD తీసుకు వచ్చారని, ఇప్పుడు ఎలాన్ మస్క్ (కేటీఆర్కు) స్పందిస్తారా అని ట్వీట్ చేశారు.
టెస్లా అప్ విడుదలపై...
భారత్లోకి టెస్లా కార్ల విడుదలపై ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా ఇటీవల మస్క్ను ప్రశ్నించారు. టెస్లా విడుదల పైన అప్ డేట్ ఉందా, ఈ కార్లు చాలా బావుంటాయని, ప్రపంచంలోని ప్రతిచోట వీటిని విడుదల చేయాలని పేర్కొన్నారు. దీనిపై మస్క్ స్పందించారు. ప్రభుత్వంతో సవాళ్లు ఉన్నాయని, దీనిపై ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ట్వీట్కు అనుకూలంగా, అననుకూలంగా పెద్ద ఎత్తున ట్వీట్లు వచ్చాయి. ఇది వివాదం కావడంతో భారత ప్రభుత్వం స్పందించింది.
ఈ పరిస్థితుల్లో..
సోషల్ మీడియ్ వేదికగా మస్క్ భారత్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలాంటి ట్రిక్స్కు ప్రభుత్వం ఎన్నడూ తలొగ్గదని పేర్కొన్నాయి. దేశంలో టెస్లా కార్లను తయారు చేసే అంశంపై ఎలాంటి హామీ ఇవ్వకుండానే దిగుమతి సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేస్తోందని, ఆటోమొబైల్ రంగానికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ ప్రోత్సాహకాలు ఇస్తోందని, టెస్లా కనుక ఇక్కడే కార్లను తయారు చేస్తే ఎంతో లబ్ధి ఉంటుందని పేర్కొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.