Koo: ట్విట్టర్ ను వీడండి.. Kooకి రండి.. ఎలాంటి ఫీజులు చెల్లించక్కర్లేదు..!
Koo VS Twitter: ట్విట్టర్ కు పోటీగా ఉన్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ Koo బంపర్ ఆఫర్ ప్రకటించింది. ట్విట్టర్ బ్లూ చెక్ పొందేందుకు ఖాతాదారులు నెలకు రూ.1,600 చెల్లించాల్సి రావటం పెద్ద ఇబ్బందిగా మారనుంది. ఈ క్రమంలో యూజర్లను ఆకర్షించేందుకు కూ కొత్త ప్రకటన చేసింది.
|
NO ఫీ..
భారతీయ ప్లాట్ఫారమ్ Koo లో ధృవీకరణకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని సీఈవో, సహవ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ట్విట్టర్ లో వెల్లడించారు. #switchtokoo పేరుతో ప్రజల కూ కుటుంబానికి తరలిరావాలని ట్విట్టర్ వేధికగా కోరారు. భారత ప్రభుత్వంలోని అనేక మంది నాయకులు ఇప్పటికే తమ ఫాలోవర్లకు ఈ సామాజిక మాధ్యమం ద్వారా చేరువయ్యారు.
అత్యధిక ఛార్జీలు..
ట్విట్టర్ ఒక్కో ఖాతాదారుని నుంచి నెలకు దాదాపు 20 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.1,650 చెల్లించాలని తాజాగా వెల్లడించింది. స్పామ్, ట్రోల్లతో పోటీ పడటానికి ఇది ఏకైక మార్గం అని ఎలాన్ మస్క్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం ట్విట్టర్ నెలకు వసూలు చేస్తున్న డబ్బు Netflix, Amazon Prime నెలవారీ సభ్యత్వం కంటే ఎక్కువని చాలా మంది అంటున్నారు.
బోర్డు రద్దు..
కంపెనీని దక్కించుకున్న ఎలాన్ మస్క్ రోజుల వ్యవధిలోనే సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో మెుత్తం 7,500 మంది ఉద్యోగులు ఉండగా.. వీరిలో 25% మందిని తొలగించాలని మస్క్ చూస్తున్నారు. ఇందుకోసం లిస్ట్ రెడి చేయాలని ఇప్పటికే ఆదేశాలు సైతం జారీ చేశారు. కాగా.. ఎలాన్ మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. కంపెనీ బోర్డు సభ్యులందరిని తొలగించారు. దీంతో ప్రస్తుతం ఆయన ఒక్కడే బోర్డ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే ఇది తాత్కాలికమైనదేనని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్కు అందించిన వివరాల్లో వెల్లడించారు. ఈ స్థానంలో ఎవరిని తీసుకొస్తారనేదానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ట్విట్టర్ లో సౌదీ పెట్టుబడులు..
తాజాగా ఎలాన్ మస్క్ యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కు అందించిన వివరాల ప్రకారం కంపెనీలో సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సె సైతం ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ కూడా మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్ లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.