సిల్వర్ లేక్ తర్వాత.. రిలయన్స్ రిటైల్లో KKR భారీ పెట్టుబడి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్లో కేకేఆర్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకు డిజిటల్ ప్లాట్ఫాం జియోలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ రిటైల్లోకి వస్తున్నాయి. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ఇప్పటికే అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ రూ.7500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా కేకేఆర్ కూడా 1 బిలియన్ డాలర్ల నుండి 1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)లో సిల్వర్ లేక్ రూ.7500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. ప్రీ-మనీ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.21 లక్షల కోట్ల వద్ద ఈ పెట్టుబడులు పెడుతోంది. రూ.7500 కోట్లతో రిలయన్స్ వెంచర్స్లో 1.75 శాతం వాటాను సొంతం చేసుకోనుంది సిల్వర్ లేక్. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు రిలయన్స్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి రిలయన్స్ జియోలోకి 1.35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
సిల్వర్ లేక్ ఇంతకుముందు జియోలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు రిలయన్స్ వెంచర్పై దృష్టి సారించింది. జియోలో రూ.10,202.55 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తాజా పెట్టుబడితో రిలయన్స్లో రిలయన్స్ రిటైల్, జియో ప్లాట్ఫాం వ్యాల్యుయేషన్ రూ.9 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్. డిజిటల్ అనుబంధ విభాగం జియో బాటలోనే రిలయన్స్ రిటైల్లోను మైనార్టీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్లాన్లో ముఖేష్ అంబానీ ఉన్నట్లుగా భావిస్తున్నారు. కంపెనీ వృద్ధి కోసం రిలయన్స్ వివిధ అవకాశాల్ని పరిశీలిస్తోంది. రిలయన్స్ రిటైల్లో పది శాతం వరకు వాటాను విక్రయించే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది.