తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కేరళ, ప్రభుత్వ ఉద్యోగులకు 5 నెలలు షాక్
కరోనా కారణంగా ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. తొలి దశ (మార్చి 24 నుండి ఏప్రిల్ 14)తోనే దేశ ఆర్థిక వ్యవస్థపై లక్షల కోట్ల భారం పడుతోందని ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు రెవెన్యూ పడిపోయి, ఖర్చులు పెరిగిపోయాయి. తాజాగా, కేరళ మంత్రి ఐజాక్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా కేరళ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని ఐజాక్ శనివారం అన్నారు.
కోటి ఆశలతో వస్తే షాక్.. ఆఫర్ లెటర్లు వెనక్కి! పరిస్థితి మరీ భయానకంగా ఉందా అంటే?
రాష్ట్ర ఆదాయం రూ.250 కోట్లే
గతంలో వరదలు, ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చితికి పోయిందని చెప్పారు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం రూ.250 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని అంచనా అని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం రూ.1,700 కోట్లకు పైగా ఇస్తే మహా అయితే రూ.2,000 కోట్లు మాత్రమే ఉంటాయని చెప్పారు. కానీ ఉద్యోగుల వేతనాలకే రూ.2,500 కోట్లు అవసరమని చెప్పారు. దీంతో ప్రస్తుతం ట్రెజరీని మూసివేయాల్సిన పరిస్థితి రానుందన్నారు.
5 నెలల పాటు ప్రతి నెల 6 రోజుల వేతనం కట్
ఇలాంటి పరిస్థితుల్లో ఒక నెల శాలరీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని కోరామని మంత్రి చెప్పారు. ఈ నిధులను సీఎం కరోనా రిలీఫ్ ఫండ్కు తరలించి బాధితుల అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్, వివిధ సిబ్బంది సంస్థలు దీనిని వ్యతిరేకిస్తున్నాయన్నారు. దీంతో ప్రతి నెలలో 6 రోజుల వేతనం ఐదు నెలల వరకు కోత విధించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వచ్చే నెల నుండి ఇది అమలులోకి వస్తుందన్నారు. ఇప్పుడు ఇంతకుమించిన ఆప్షన్ లేదని, దీనిని కుదురుకున్నాక తిరిగి చెల్లిస్తామన్నారు.
వీరికి కోత
ప్రభుత్వ ఉద్యోగులు ఒక నెల వేతనం ఇవ్వాలనే తమ ఆలోచనను కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వ్యతిరేకిస్తోందని, దీంతో రాష్ట్ర ఆదాయానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల ఆరు రోజుల వేతనం ఐదు నెలల పాటు తగ్గించాలని నిర్ణయించామన్నారు. కాగా, కేరళ ప్రభుత్వం ఉద్యోగుల నెల వేతనంలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించిన అనంతరం ఈ నిర్ణయం ప్రకారం ఉద్యోగులతో పాటు రాష్ట్ర అనుబంధ పరిశ్రమలు, యూనివర్సిటీలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల వేతనం నుండి కోత ఉంటుంది.