సినిమా, సాఫ్టువేర్, పెట్రోలియం... 10ఏళ్ల ట్యాక్స్ హాలీడే: ఏపీ, తెలంగాణ వ్యాపారవేత్తలకు బంపరాఫర్!
హైదరాబాద్: ఇండియన్ ఫిల్మ్ మేకర్స్, పర్యాటకులు, వ్యాపారవేత్తలు తమ దేశానికి విచ్చేయాలని కజకిస్తాన్ రాయబారి యెర్లాన్ అలింబేవ్ అన్నారు. వీరిని ఆకర్షించేందుకు వరుసగా కార్యక్రమాలు చేపట్టనుంది. అలాగే, వచ్చే ఏడాది నుంచి ట్రాన్సిట్ వీసా డ్యురేషన్ను 72 గంటల నుంచి 120 గంటలకు పెంచనుంది. పెట్టుబడులు పెట్టేందుకు కూడా వివిధ బెనిఫిట్స్ కల్పించేందుకు సిద్ధంగా ఉంది. రెండు రోజులుగా హైదరాబాదులో పలువురు పారిశ్రామికవేత్తలతో యెర్లాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రపంచకప్, చంద్రయాన్, ఆర్టికల్ 370, పీఎం కిసాన్: 2019 గూగుల్
ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తాం
తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి తమ ప్రభుత్వం (కజకిస్తాన్) అన్ని రకాలుగా చేయూతనిస్తుందన్నారు. 14 ప్రత్యేక ఆర్థిక జోన్లు, 24 పారిశ్రామిక ప్రాంతాలతో పాటు భూమి అందుబాటులో ఉంటుందన్నారు. నిర్మాణాలు చేపటితే ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. పన్ను మినహాయింపులు కూడా ఉంటాయన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా కజకిస్తాన్ స్థిరంగా ఉందని, పారిశ్రామికవేత్తలకు కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయన్నారు.
ఈ రంగాల్లో అవకాశాలు
భారత్ - కజకిస్తాన్ మధ్య ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో తొమ్మిది నెలల్లోనే 1.2 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు. కజకిస్తాన్లో ఐటీ, ఫార్మా, మైనింగ్, మౌలిక సదుపాయాలు, అగ్రికల్చర్, పర్యాటకం, చలనచిత్ర రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టాలన్నారు. సముద్ర మార్గాన కార్గో త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 12 నుంచి 15 రోజుల్లో రవాణా చేయవచ్చునని చెప్పారు.
ట్యాక్స్ హాలీడే.. పదేళ్లు
భారత్కు విశ్వసనీయమైన భాగస్వామిగా ఉన్న కజకిస్థాన్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కూడా యెర్లాన్ అన్నారు. కజకిస్థాన్లో పెట్టుబడులు పెట్టేవారికి పలు రాయితీలతో పాటు పదేళ్ల వరకు టాక్స్ హాలిడే ఇస్తున్నట్లు తెలిపారు. పెట్రోలియం, ఐటీ, పారిశ్రామిక వాణిజ్య, ఔషధ, విద్య, వ్యవసాయం, ఫుడ్ ప్యాకేజ్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చునని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తమ దేశం 25వ స్థానంలో ఉందని చెప్పారు.