వచ్చే మూణ్ణెళ్లు కష్టమే, ఉద్యోగ నియామకాలు 15 ఏళ్లలో దారుణం: అదొక్కటే భారత్కు భారీ ఊరట
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో జాబ్ మార్కెట్పై నీలినీడలు కమ్ముకున్నాయి. రానున్న మూడు నెలల్లో కేవలం 5 శాతం కంపెనీలు మాత్రమే తాము ఉద్యోగులను తీసుకుంటామని ఓ సర్వేలో వెల్లడించాయి. హైరింగ్ సెంటిమెంట్ (ఉద్యోగ నియామకాల సెంటిమెంట్) ఏకంగా పదిహేనేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఈ మేరకు మ్యాన్పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ సర్వేలో వెల్లడయ్యాయి. కరోనా కారణంగా కొత్త ఉద్యోగాలు కరువైనట్లు తేలింది.
ఆ కంపెనీలో మూడ్రోజులే ఆఫీస్కు, ఇది చాలా తెలివైన ఆలోచన
15 ఏల్లలో అత్యంత నిరాశాజనకం
ఈ మహమ్మారి నేపథ్యంలో కార్పోరేట్ రంగం ఉద్యోగాల విషయంలో వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ క్వార్టర్లో ఉద్యోగులను నియమించుకునే ఆలోచనే కేవలం ఐదు శాతం కంపెనీలకు మాత్రమే ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రారంభించిన పదిహేనేళ్లలో నియామకాలపై కార్పోరేట్లలో ఇదే అత్యంత నిరాశాజనక దృక్పంథం.
అయినా భారత్ చాలా బెస్ట్
అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగు అని చెబుతోంది ఈ సర్వే. మొత్తం 43 దేశాల్లో ఉద్యోగ నియామకాలపై సానుకూలంగా ఉన్న టాప్ 4 దేశాల్లో భారత్ ఉందని తెలిపింది. జపాన్లోని 11 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకునే యోచనలో ఉన్నాయి. చైనా, తైవాన్ 3 శాతం చొప్పున నియామకాలు చేపట్టనున్నట్లు తేలింది. ఇండియాలో ఈ సర్వేలో 695 కంపెనీలు పాల్గొన్నాయి.
ఏ రంగంలో ఎంత శాతం నియామకాలు..
మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఎక్కువగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఈ రంగంలో 12 శాతం కంపెనీలు కొత్త నియామకాలు ఉంటాయని తెలిపాయి. ఆ తర్వాత ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ అండ్ ఇన్సురెన్స్ రంగాల్లో 9 శాతం వరకు నియామకాలు ఉండనున్నాయి.
సర్వీస్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో హైరింగ్ సెంటిమెంట్ వరుసగా 4 శాతం, 2 శాతం మాత్రమే ఉండనున్నాయి. అంతకుముందు ఈ రంగాల్లో 9 శాతం, 7 శాతంగా ఉండగా, 5 శాతం చొప్పున తగ్గాయి. జూలై - సెప్టెంబర్ క్వార్టర్లో మైనింగ్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్, ఇన్సురెన్స్, రియల్ ఎస్టేట్ రంగాలు జాబ్ మార్కెట్ను కాస్త ముందుకు నడిపించనున్నాయి.
ఈ ప్రాంతాల్లో సానుకూల వైఖరి
కొత్త నియామకాలపై ఉత్తర, దక్షిణాది మార్కెట్లలో సానుకూల వైఖరి ఎక్కువగా కనిపించింది. టోకు, రిటైల్ వర్తక వ్యాపారాలు అధికంగా ప్రభావితమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా తమ వ్యాపారం కుదేలయిందని సర్వేలో పాల్గొన్న వారిలో 88 శాతం మంది చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ ఆర్థిక కార్యకలాపాలు ముందుకు సాగేందుకు ఉపయోగపడుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు.
మిగతా దేశాలతో పోలిస్తే..
జపాన్, ఇండియా, అమెరికా, చైనా, తైవాన్ దేశాలలో నియామక ప్రక్రియ మిగతా దేశాలతో పోలిస్తే కాస్త ఆశాజనకంగా ఉంది. సింగపూర్, కోస్టారికా, కొలంబియా, పెరూ, దక్షిణాఫ్రికాలోని కంపెనీలు బలహీనమైన జాబ్ మార్కెట్ను అంచనా వేస్తున్నాయి.
వచ్చే ఏడాదికి పుంజుకోవచ్చు
లాక్ డౌన్ సమయంలో కార్పోరేట్ రంగానికి సాంకేతికత గేమ్ చేంజర్గా ఉపయోగపడిందని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ తెలిపారు. కంపెనీలు వర్చువల్ మీటింగ్స్తో ముందుకు సాగాయని, ఈ కష్ట కాలాన్ని ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచే శిక్షణ కోసం ఉపయోగించుకున్నాయని, పరిణామాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యాపారాన్ని మలుచుకోవడమనేది కంపెనీలకు సరికొత్త సాధారణ ప్రక్రియగా మారిందన్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుందన్నారు. ఉద్యోగ కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని, దీంతో ఈ సంవత్సరం చివరి నాటికి మంచి రోజులు రావొచ్చునన్నారు. 2021లో జాబ్ మార్కెట్, ఆర్థిక వృద్ధి పుంజుకోవచ్చునన్నారు.