భారత్లో, ప్రపంచంలో అత్యంత ఆందోళనలు ఇవే: మా టర్న్ వస్తుంది.. అర్బన్ ఇండియా అదుర్స్
అర్బన్ ఇండియాలో అక్టోబర్ నెలలో నిరుద్యోగిత పట్ల ఎక్కువమంది ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో పేదరికం, సామాజిక అసమతౌల్యత పైన ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు Ipsos వాట్ వర్రీస్ ది వరల్డ్ గ్లోబల్ మంత్లీ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం గతంలో చాలామంది కరోనా పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, అలాగే అర్బన్ ఇండియాలో కోవిడ్ 19 పట్ల ఆందోళన తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా (భారత్ సహా 28 మార్కెట్లు) వరుసగా 18 నెలల పాటు ఎక్కువమంది కోవిడ్ 19 పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలలో ఇది తగ్గింది.
భారత్లో నిరుద్యోగిత, ప్రపంచంలో అసమానత
భారత్ విషయానికి వస్తే అర్బన్ సిటిజన్స్లో 42 శాతం మంది నిరుద్యోగిత పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వరుసగా కరోనా పట్ల 35 శాతం మంది, ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ కరప్షన్ పట్ల 30 శాతం మంది, పేదరికం, సామాజిక అసమానతపై 26 శాతం, నేరాలు, హింస పైన 24 శాతం మంది, విద్య పైన 20 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ సిటిజన్స్ విషయానికి వస్తే సామాజిక అసమానత, పేదరికంపై 33 శాతం మంది, నిరుద్యోగితపై 30 శాతం మంది, కరోనా మహమ్మారిపై 29 శాతం మంది, ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ కరప్షన్ పైన 29 శాతం మంది, నేరాలు, హింస పైన 27 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.
అదొక్కటి సంతోషం...
Ipsos India సీఈవో అమిత్ అదార్కర్ మాట్లాడుతూ.. మన అతిపెద్ద సమస్య నిరుద్యోగిత అని, ముఖ్యంగా అర్బన్ ఇండియన్స్లో ఇది ఎక్కువగా ఉందని చెప్పారు. జాబ్ క్రియేషన్స్, జాబ్ ఓపెనింగ్స్ అంచనాలకు తగినట్లుగా లేవన్నారు. ప్రస్తుతం పూర్తిగా డిస్కనెక్ట్ అయిందని చెప్పారు. అయితే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం సంతోషకరమైన అంశమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మరింత సాధారణ స్థితికి చేరుకొని, జాబ్ మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడుతుందని చెప్పారు.
భారత్ సరైన దిశలో...
జాబ్ మార్కెట్ పైన ఎక్కువమంది అసంతృప్తితో ఉన్నప్పటికీ, భారత్ మాత్రం సరైన దిశలో ముందుకు సాగుతోందని 68 శాతం మంది అర్బన్ ఇండియన్స్ అభిప్రాయపడ్డారు. ఆశావాద దృక్పథంలో భారత్ రెండో స్థానంలో ఉంది. సౌదీ అరేబియా 83 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 64 శాతం మంది సిటిజన్లు తమ తమ దేశాలు సరైన దారిలో వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ భారత్ సరైన దారిలో వెళ్తోందని దాదాపు నాలుగింట మూడొంతుల మంది చెప్పడం గమనార్హం. మార్కెట్లు కొలంబియా (90 శాతం), పెరు (83 శాతం), అర్జెంటీనా (82 శాతం) పతనమయ్యాయి.
అర్బన్ భారత్ అదుర్స్
అర్బన్ ఇండియన్స్లో అత్యంత సానుకూల వైఖరి కనిపిస్తోంది. డై-యాట్యిట్యూడ్కు దూరమని చెప్పారు. ఎన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ తమ టర్న్ వస్తుందని పూర్తి ఆశాభావంతో ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. వారు ఏది కూడా మధ్యలో వదిలి వేయడానికి ఇష్టపడటం లేదని అమిత్ అదార్కర్ చెప్పారు.
Ipsos మొత్తం 28 దేశాల్లో వాట్ వర్రీస్ ది వరల్డ్ సర్వేను నిర్వహించింది. Ipsos ఆన్లైన్ పానెల్ సిస్టం ద్వారా దీనిని నిర్వహించింది. మొత్తం 21,516 మంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 8 వరకు ఈ సర్వే నిర్వహించారు. 18 ఏళ్ల నుండి 74 ఏళ్ల వ్యక్తులు ఈ సర్వేలో పాల్గొన్నారు. భారత్ సహా అమెరికా, సౌతాఫ్రికా టర్కీ, ఇజ్రాయెల్, కెనడా దేశాల వారు పాల్గొన్నారు.