మరో గోల్డ్ స్కీమ్ స్కాం.. విలువ రూ.300 కోట్లు, యజమానులు అరెస్ట్!
బంగారు ఆభరణాల విక్రయాలకు సంబంధించి వివిధ ప్రమోషన్ల పేరుతో ఆభరణాల సంస్థలు అమలు చేస్తోన్న గోల్డ్ స్కీమ్లు కొత్తలో ఆకర్షణీయంగా, అత్యంత లాభదాయకంగా కనిపిస్తున్నా.. చివరికి అవి వినియోగదారుల నెత్తిన శఠగోపం పెడుతున్నాయి. ఈ మధ్య ముంబైలో ఇలాగే గుడ్విన్ స్కాం వెలుగుచూసింది. ఈ స్కీమ్లో చేరిన కస్టమర్లు కోట్లాది రూపాయల తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారు.
గుడ్విన్ స్కాం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే.. రసిక్లాల్ సంకల్చాంద్ జ్యూయలర్స్ (ఆర్ఎస్జే) అనే మరో సంస్థ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఆర్ఎస్జే గోల్డ్ స్కీమ్లో చేరి భారీగా నష్టపోయిన పలువురు కస్టమర్లు లబోదిబోమంటూ స్థానిక పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు. గుడ్విన్ తరహాలోనే అక్టోబర్ 28న ఆర్ఎస్జే దుకాణాలకు కూడా తాళాలు వేయడంతో.. ఈ సంస్థలో చేరి నష్టపోయిన పలువురు కస్టమర్లు పోలీసులను ఆశ్రయించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా ఆర్ఎస్జే దుకాణం యజమానులు జయేష్ రసిక్లాల్ షా(55), నీలేష్ రసిక్లాల్ షా (53)లను ముంబై ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అరెస్టు కూడా చేసింది. మొత్తం రూ.300 కోట్ల మేర కస్టమర్లను మోసగించినట్టుగా ప్రాథమికంగా తేలిందని పోలీసు అధికారులు మంగళవారం చెప్పారు.
మంచి రాబడిని వస్తుందని ఆర్ఎస్జే యజమానులు నమ్మబలకడంతో చాలామంది అనేక నెలలుగా వీరి గోల్డ్ స్కీమ్లలో చేరి పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఆర్థిక నేరాల విభాగం అధికారులు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 420 (మోసం), 406 (క్రిమినల్ ట్రస్ట్ ఉల్లంఘన), మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ (ఎంపిఐడి) చట్టం కింద కేసులు నమోదు చేశారు.
రసిక్లాల్ సంకల్చాంద్ జ్యూయలర్స్లో పనిచేస్తోన్న ఉద్యోగులు కొందరు సంస్థ తమకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించలేదంటూ గత వారం లేబర్ కమిషనర్కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత అధికారులు ఈ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు.