పండుగ సీజన్లో 65% బంగారం వ్యాపారం, ధర కలిసి వస్తోంది..
కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కుదుటపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మాసంలో వాహనాల సేల్స్ పెరగడంతో పాటు డిమాండ్ పెరిగిన సంకేతాలు కనిపించాయి. కరోనా కారణంగా ఇన్నాళ్లు సన్నగిల్లిన డిమాండ్ దసరా, దీపావళి పండుగ సీజన్లో పుంజుకుంటుందని జ్యువెల్లరీ వ్యాపారులు భావిస్తున్నారు. ఏడాదిలో జరిగే మొత్తం వ్యాపారంలో 60 శాతం నుండి 65 శాతం ఈ పండుగ సీజన్లో జరిగే అవకాశం ఉందని ఆలిండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ దేశీయ మండలి(జీజేసీ) చైర్మన్ అనంత పద్మనాభన్ అన్నారు.
డాక్టర్ రెడ్డీస్పై సైబర్ అటాక్, ప్రపంచవ్యాప్తంగా ప్లాంట్స్ క్లోజ్: వ్యాక్సీన్ టార్గెట్?
పెరుగుతున్న సేల్స్
దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో ఇప్పుడిప్పుడు రిటైల్ దుకాణాల్లో కస్టమర్లు పెరుగుతున్నారు. వారం, పది రోజులుగా అమ్మకాలు ఊపందుకున్నాయి. బంగారం ధర నెల రోజులకు పైగా రూ.49వేల నుండి రూ.51వేల మధ్య స్థిరంగా కనిపిస్తోంది. దీంతో అమ్మకాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యువెల్లరీ యజమానులు కూడా సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ ఏడాది సేల్స్లో 60 శాతం-65 శాతం ఈ పండుగ సీజన్లో పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రీ-కరోనా సేల్స్తో పోలిస్తే పది రోజుల క్రితం వరకు సేల్స్ 20 శాతం నుండి 25 శాతానికి మించలేదు. కానీ ఇప్పుడు 40 నుండి 50 శాతానికి చేరుకున్నాయి.
పెళ్లిళ్ల సీజన్
పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు ఈ త్రైమాసికానికి వాయిదా పడ్డాయి. దీంతో సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే గత పెళ్లిళ్ల సీజన్ వలె మాత్రం డిమాండ్ కనిపించదని అంటున్నారు. ఎందుకంటే శుభకార్యాలయాలకు వచ్చే అతిథుల సంఖ్యపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దసరా పండుగ రోజు సేల్స్ బాగుంటాయి. ప్రస్తుత బంగార ధరలకు ప్రజలు అలవాటు పడ్డారని చెబుతున్నారు. ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోల్చుకుంటున్నారని, దీనికి తోడు నెల రోజులకు పైగా దాదాపు స్థిరంగా ఉంటున్నాయని, దీంతో అలవాటుపడ్డారని అంటున్నారు. 56వేల నుండి 52వేలకు దిగి రావడం సేల్స్కు దోహదపడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
డిమాండ్ కొనసాగుతుందా
నగల తయారీ వ్యాపారులకు డిమాండ్ మేరకు ఆభరణాల తయారీ సమస్యగా మారుతోందని అంటున్నారు. కరోనా కారణంగా తయారీదారులు స్వస్థలాలకు వెళ్ళారు. వారు ఇంకా తిరిగిరాలేదు. ఈ డిమాండ్ ఇలాగే కొనసాగుతుందా అనే సంధిగ్దం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తయారీ సమస్యగా మారిందని అంటున్నారు. కార్మికులు వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని చెబుతున్నారు.