మేం మీతో పోటీ పడలేం.. గో బ్యాక్ జెఫ్ బెజోస్: రూ.7,100 కోట్ల పెట్టుబడిపై అమెజాన్ సీఈవోకు షాక్
ఢిల్లీ: అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారత్లో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతానని ప్రకటించారు. మన కరెన్సీలో రూ.7,100 కోట్లు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన అమెజాన్ సంభవ్ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువ కలిగిన మేకిన్ ఇండియా ఉత్పత్తులను అమెజాన్ ఎగుమతి చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. భారత్-అమెరికా మధ్య మరింత సంఖ్యత ఉండాల్సిన అవసరముందన్నారు.
కంపెనీల్లో 1 బిలియన్ డాలర్ పెట్టుబడులు: అమెజాన్ ఫౌండర్
7వేల కోట్ల పెట్టుబడిపై వ్యాపారుల ఆగ్రహం
భారత్లో రూ.7వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని జెఫ్ బెజోస్ చేసిన ప్రకటనపై అఖిల భారత వర్తక వ్యాపారుల సమాఖ్య(CAIT) మండిపడింది. భారత్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కొల్లగొట్టేందుకు అమెజాన్ ప్రయత్నాలు చేస్తోందని తీవ్రంగా ధ్వజమెత్తింది. కేవలం వారి ప్రమోషన్ కోసమే తాజా పెట్టుబడుల నిర్ణయాన్ని వెల్లడించారని విమర్శించారు.
జెఫ్ గో బ్యాక్ అంటూ నినాదాలు
ఇండియా నిబంధనలను అతిక్రమిస్తూ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ పోర్టల్స్ ఇచ్చే భారీ డిస్కౌంట్ల కారణంగా చిరు వ్యాపారులు ఉపాధిని కోల్పోతున్నారని CAIT ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా జెఫ్ బెజోస్ రాకను నిరసిస్తూ బుధవారం నుంచి నిరసనలు చేపడుతోంది. జెఫ్ బెజోస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
మేం వారితో పోటీ పడలేం..
మేం వారితో పోటీ పడలేమని, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటి ద్వారా అనారోగ్యకరమైన పోటీ నెలకొందని ఓ వ్యాపారి అన్నారు. గత రెండేళ్లలో తమ అమ్మకాలు 15 శాతం కంటే ఎక్కువగా తగ్గాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ డిస్కౌంట్ల కారణంగా వినియోగదారులు ఆన్ లైన్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
120 బిలియన్ డాలర్ల మార్కెట్
మరోవైపు, తమ వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు 5,50,000 మంది సెల్లర్స్కు తమ ప్లాట్ ఫాం ద్వారా అవకాశం కల్పిస్తున్నామని అమెజాన్ చెబుతోంది. భారత ఈ-కామర్స్ మార్కెట్ ఈ ఏడాదికి 120 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా. 2017-2020 మధ్య ఈ వృద్ధి 51 శాతంగా ఉండటం ఉంటుందని ఓ సర్వే అంచనా.