బెంగళూరు, హైదరాబాద్లోనే ఐటీలో అత్యధిక వేతనాలు: జనవరిలో 39% పెరిగిన నియామకాలు
కరోనా ప్రభావం తక్కువగాపడిన రంగాల్లో ఐటీ ఉంది. ఈ రంగంలో లాక్ డౌన్ తర్వాత నుండి క్రమంగా నియామకాలు పెరుగుతున్నాయి. 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే జనవరి 2021లో ఉద్యోగ నియామకాల్లో 39 శాతం వృద్ధి కనిపించింది. ఐటీ రంగం తర్వాత BPO రంగంలో 10 శాతం, బ్యాంకింగ్ రంగంలో 6 శాతం వృద్ధి కనిపించిందని జాబ్ సైట్ సైకీ(SCIKEY) నివేదిక వెల్లడించింది. కరోనా సమయంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల కోత కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఐటీ రంగం మాత్రం మిగతా వాటితో పోలిస్తే వేగంగా కోలుకుంది.
LIC సరికొత్త 'బీమా జ్యోతి' ప్లాన్: కనీస పాలసీ రూ.1,00,000, ఎన్నో ప్రయోజనాలు...
హైదరాబాద్, బెంగళూరులలో అత్యధిక వేతనాలు
ఐటీ రంగంలో పలు మెట్రో నగరాల్లో జాబ్ పోస్టింగ్స్ క్రమంగా పెరిగాయి. బెంగళూరు, హైదరాబాద్, పుణే, ఢిల్లీ నగరాల్లో నియామకాలు ప్రతి నెల వృద్ధిని సాధిస్తున్నాయి. జనవరి నెలలో కేవలం ఈ రంగంలోనే 50 శాతం ఉద్యోగాలు వచ్చాయి. సిక్కీ మార్కెట్ నెట్ వర్క్ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా 15,000కు పైగా జాబ్ పోస్టింగ్స్ నుండి డేటాను విశ్లేషించింది. రూ.25 లక్షలు అంతకంటే ఎక్కువ వేతనం ఎక్కువగా ఇచ్చే నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు ఉన్నట్లు తెలిపింది.
బెంగళూరు అగ్రస్థానం
రూ.6 లక్షల లోపు, అలాగే రూ.6 లక్షలు-రూ.12 లక్షల మధ్య వేతనం కలిగిన ఉద్యోగాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఐటీ సెక్టార్లో ప్రాజెక్టు మేనేజర్లకు అధిక డిమాండ్ ఉందని, ఇది 47 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ 6 శాతం, బ్యాంకింగ్ 4 శాతం, రిక్రూట్మెంట్ 3 శాతంగా ఉంది. ఇతర పరిశ్రమలతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ 30 శాతంతో అగ్రస్థానంలో ఉంది.
ఐటీ అసాధారణ పురోగతి
కరోనా వైరస్ నేపథ్యంలో కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి పొందండంలో ఐటీ రంగం అసాధరణమైన పురోగతిని సాధించిందని ఈ నివేదిక తెలిపింది. డిజిటల్ మార్పు, రిమోట్ వర్క్ వంటి వాటితో వివిధ రంగాల ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణలో ఐటీ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని SCIKEY కోఫౌండర్ అక్షయ్ శర్మ తెలిపారు. వివిధ రంగాల్లో జాబ్ మార్కెట్ ఇప్పటికీ స్ట్రగుల్ పడుతోందని, ఐటీ నియామకాలు మాత్రం బాగున్నాయని తెలిపారు. వృద్ధి ఇలాగే కొనసాగితే రికవరీ వేగవంతంగా ఉంటుందని తెలిపింది.