సెప్టెంబర్ 29 వరకు... ఆరు నెలల్లో రూ.1.18 లక్షల కోట్ల రీఫండ్స్
కరోనా మహమ్మారి నేపథ్యంలో ట్యాక్స్ పేయర్లకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రప్రభుత్వం పన్ను సంబంధిత సేవల్ని ఇబ్బందుల్లేకుండా అందిస్తోంది. ఇందులో భాగంగా ట్యాక్స్ పేయర్స్ రీఫండ్ చేయాల్సిన మొత్తాలను వేగవంతంగా చెల్లిస్తోంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) పన్ను చెల్లింపుదారులకు ఇప్పటి వరకు రూ.1,18,324 కోట్ల మొత్తాన్ని రీఫండ్ చేసింది. ఈ మేరకు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 29వ తేదీ మధ్య ఈ చెల్లింపులు జరిగాయి.
గుడ్న్యూస్, ఐటీ రిటర్న్స్ దాఖలు 2 నెలలు గడువు పెంపు, ఇలా చేయండి...
33 లక్షల ట్యాక్స్ పేయర్స్...
33 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్కు ఆరు నెలల్లో రూ.1.18 లక్షల కోట్ల మేర చెల్లించినట్లు ఆదాయపు పన్ను శాఖ బుధవారం తెలిపింది. ఇందులో పర్సనల్ ఇన్కం ట్యాక్స్(PIT) రీఫండ్ అమౌంట్ రూ.32,230 కోట్ల రీఫండ్స్ 31.75 లక్షల ట్యాక్స్ పేయర్స్కు చెల్లించినట్లు తెలిపింది. కార్పోరేట్ రీఫండ్స్ విషయానికి వస్తే 1.78 లక్షల కేసుల్లో రూ.86,094 కోట్లు అందించినట్లు తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పన్ను సంబంధిత సేవల్ని అందించడంపై దృష్టి సారించింది. పెండింగ్లో ఉన్న పన్ను రీఫండ్స్ను క్లియర్ చేస్తోంది.
20 రోజుల క్రితమే రూ.1 లక్ష కోట్లు క్రాస్
గత నెల వరకే లక్ష కోట్లు దాటాయి. ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ మధ్య 27.55 లక్షల మంది ట్యాక్స్పేయర్స్కు రూ.1.01 లక్షల కోట్లకు పైగా రీఫండ్స్ జారీ చేసింది. ఇందులో 25,83,507 పన్ను చెల్లింపుదారులకు రూ.30,768 కట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను రీఫండ్స్, 1,71,155 పన్ను చెల్లింపుదారులకు .70,540 కోట్ల కార్పోరేట్ పన్ను రీఫండ్స్ చెల్లించింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది.
కరోనా.. వెసులుబాటు
కోవిడ్ 19 కారణంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకుంటోంది. పీఎఫ్ అకౌంట్ నుండి ఉద్యోగులు మూడు నెలల వేతనం లేదా 75 శాతం.. ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తం తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని కూడా పొడిగించి వెసులుబాటు ఇస్తోంది. తాజాగా 2019-20 ఆర్థిక అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీ రిటర్న్స్) దాఖలుకు గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) బుధవారం తెలిపింది.