Infosys: యువ టెక్కీలకు గుడ్ న్యూస్.. విశాఖ కేంద్రం ప్రారంభిస్తున్న ఇన్ఫోసిస్.. ఎప్పటి నుంచి అంటే..?
Infosys At Vizag: ఆంధ్రప్రదేశ్ లోని ఉక్కునగరం విశాఖ ఐటీ హబ్ గా మారుతోంది. ఇంతకు ముందు ప్రకటించినట్లుగానే దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మధురవాడ సెజ్లో కార్యకలాపాలను ప్రారంభించటానికి సిద్ధమౌతోంది. ప్రధానంగా ఉద్యోగులకు వీలు కల్పించేందుకు టైర్-2, 3 నగరాల్లో కంపెనీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు గతంలో కంపెనీ తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే.
కార్యాలయం ప్రారంభం..
కంపెనీ విశాఖ కార్యాలయం నుంచి సేవలు అందించటం అక్టోబర్ 1న ప్రారంభిస్తోంది. తాక్కాలికంగా సెజ్లోని మహతి సొల్యూషన్స్ ప్రాంగణంలో కంపెనీ పనిచేయటం ప్రారంభిస్తుంది. రానున్న రోజుల్లో కంపెనీ సొంత భవనాన్ని నిర్మించుకుంటుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో డల్లాస్ టెక్నాలజీస్ కంపెనీ సైతం తన కార్యకలాపాలను త్వరలోనే విశాఖకు షిఫ్ట్ చేయనున్నట్లు సమాచారం. రానున్న కాలంలో విశాఖ ఐటీ కంపెనీలకు అనువైన నగరంగా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తొలి దశలో..
కంపెనీ తొలిదశలో దాదాపు 1,000 మంది ఉద్యోగులతో కార్యాలయం నుంచి సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. రానున్న కాలంలో ఉద్యోగుల సంఖ్య 2,500 నుంచి 3,000 వరకు చేరవచ్చు. ఉద్యోగుల విస్తరణకు సంబంధించి ఇన్ఫోసిస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, ఇతర అధికారులు ఇప్పటికే ప్రకటన చేశారు.
కంపెనీ ఎందుకీ నిర్ణయం..?
కరోనా రాకతో దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు లాక్ డౌన్ సమయంలో తమ సొంత నగరాలకు, ప్రాంతాలకు తరలిపోయారు. అయితే పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి ఆఫీసులకు రావటానికి చాలా మంది విముఖత చూపుతున్నారు. దీంతో దేశంలోని టాలెంట్ పూల్ను చేరుకునేందుకు ఇన్ఫోసిస్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. అందులో భాగంగా టాలెంటెడ్ ఉద్యోగులకు అందుబాటులోకి వచ్చేందుకు కోయంబత్తూర్, వైజాగ్, కోల్కతా, నోయిడా నగరాల్లో కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది.
|
ఏపీ ప్రభుత్వం..
ఇన్ఫోసిస్ తన కేంద్రాన్ని విశాఖలో ప్రారంభించటంపై రాష్ట్ర ఐటీ ,పరిశ్రమలశాఖ మంత్రి జీ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ రాకను స్వాగతిస్తున్నట్లు ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. దీంతో రాష్ట్రంలోని టెక్కీలు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.