ముఖ్యమంత్రి గారూ! జోక్యం చేసుకోండి: తొలగింపు, వేతనాల కోతపై ఐటీ ఉద్యోగుల ఫిర్యాదు
కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగాల కోత లేదా వేతన కోతకు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ కంపెనీలపై కూడా భారీ ప్రభావం పడింది. దిగ్గజ ఐటీ కంపెనీల్లో పెద్దగా ఉద్యోగాల కోత లేనప్పటికీ, ఓపెనింగ్స్ మాత్రం అంతగా ఉండవని చెబుతున్నాయి. అయితే బిజినెస్ లేక.. ఆదాయం లేక చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరిన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తున్నాయి. దీనిపై ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్లింది.
ప్రతి గూగుల్ ఉద్యోగికి అదనంగా రూ.75,000, ఎందుకంటే: సుందర్ పిచాయ్ ప్రకటన
సీఎం గారూ.. జోక్యం చేసుకోండి
కరోనా సంక్షోభంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుకు, వేతన కోతకు పాల్పడుతున్నారని చెబుతూ ఐటీ ఉద్యోగుల యూనియన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాసింది. ఐటీ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. మహారాష్ట్ర వ్యాప్తంగా పలు ఐటీ, అనుబంధ కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయని, వేతనాలు ఇవ్వకుండా కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని జాతీయ ఐటీ ఎంప్లాయీస్ సెనెట్ (NITES) సీఎంకు లేఖ రాసింది.
ఆదేశాలు జారీ చేయాలి
ఉద్యోగాల కోత లేదా వేతన కోత అంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని NITES తెలిపింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉద్యోగుల హక్కులని కాపాడేలా ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేయాలని NITES ప్రధాన కార్యదర్శి హర్ప్రీత్ సలుజా అన్నారు. ఈ మేరకు మంగళవారం లేఖ రాశారు. చాలా IT/ITeS/BPO/KPO కంపెనీలు ఉద్యోగాల కోత, వేతన కోతకు పాల్పడుతున్నాయన్నారు.
ఉద్యోగులు బలవుతున్నారు
మహారాష్ట్రలోని ఆరు లక్షల మంది IT/ITeS/BPO/KPO ఉద్యోగులు, వారి కుటుంబాలను కాపాడేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులోను ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని కోరారు. ప్రస్తుత మహమ్మారితో ఉద్యోగులకు సంబంధం లేదని, కానీ అయినప్పటికీ వారే బలి కావాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగం కోల్పోతున్నారని, రోజువారీ ఆదాయాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
68,000 మంది పిటిషన్
చాలామంది ఉద్యోగులకు కనీసం నోటీసు పీరియడ్ ఇవ్వలేదని, ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వడం, కంపన్షేషన్ చెల్లింపులు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి కార్మిక విధానాలు కూడా అవలంభించడం లేదని తెలిపారు. ఈ లేఖను తాము మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించామని, తమకు రసీదు అందిందని NITES తెలిపింది. దాదాపు 68,000 మంది ఉద్యోగులు అక్రమ తొలగింత, వేతనాల్లో కోత, ఎర్న్డ్ లీవ్స్ డిడక్షన్, బలవంతపు రాజీనామా సహా వివిధ రకాల పిటిషన్లను లేబర్ కమిషనర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు దాఖలు చేశారని తెలిపారు.