40 Under 40: అమెజాన్, ఫ్లిప్కార్ట్కు సవాల్...ఇషా-ఆకాష్ అంబానీ అదుర్స్,ఫార్చూన్లో బైజూస్ రవీంద్రన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వారసులు ఈషా అంబానీ, ఆకాష్ అంబానీలు అత్యంత ప్రభావవంతమైన యువత జాబితాలో చేరారు. 28 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 40 ఏళ్లలోపు అద్భుతాలు సాధించిన 40మందితో కూడిన జాబితాను ఫార్చూన్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తోంది. ఇందులో భారత్ నుండి పలువురికి చోటు దక్కింది.
ఈషా, ఆకాశ్లతో పాటు బైజూస్ బైజూస్ యాప్ బైజు రవీంద్రన్కు చోటు దక్కింది. కరోనా ప్రజల పని చేసే విధానాన్ని, సమాజంలో జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని, అయితే ఈ సవాళ్లలో తమ వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించిన వారు ఉన్నారని ఫార్చ్యూన్ పేర్కొంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అదర్ పూనావాలకు చోటు దక్కింది.
టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా ఐటీ కంపెనీలకు అలా మంచి ఛాన్స్!
టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో..
ఆయా రంగాల్లోని ప్రభావవంతమైన 40 ఏళ్ల లోపు వ్యక్తుల్ని ఎంపిక చేసి ప్రతి సంవత్సరం ఫార్చ్యూన్ ఈ జాబితాను విడుదల చేస్తుంది. ఈసారి ఏకంగా 5 విభాగాలకు (ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్ కేర్, ప్రభుత్వం, రాజకీయాలు, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్) విడిగా జాబితాలను విడుదల చేసింది. ఈషా, ఆకాష్, బైజు రవీంద్రన్లకు టెక్నాలజీ విభాగం జాబితాలో చోటుదక్కింది. పూనావాలాకు హెల్త్ కేర్ విభాగంలో చోటు దక్కింది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ను సవాల్ చేస్తూ.. అకాష్, ఇషా కీలకం
జియోకు ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోరసాయనాల వ్యాపారం భారీ లాభాల్లో ఉంది. 2016లో జియో రావడంతో మొబైల్ విప్లవం ప్రారంభమైంది. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆకాష్ 2014లో రిలయన్స్ సంస్థలో చేరారు. ఏడాది తర్వాత ఇషా జత కలిసింది. యేల్, స్టాన్ఫోర్ట్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న ఇషా మొదట అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజం మెకెన్సీలో పని చేశారు. ఇప్పుడు వీరిద్దరు రిలయన్స్ జియో బోర్డ్ సభ్యులుగా ఉన్నారు. ఇషా, ఆకాష్లు ఇటీవల జియోమార్ట్ను లాంచ్ చేశారని, ఇది అమెజాన్, వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ను సవాల్ చేస్తుందని ఫార్చ్యూన్ మేగజైన్ పేర్కొంది.
బైజూస్ రవీంద్రన్.. నేర్పించారు
ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీని పెద్ద ఎత్తున ఎలా విజయవంతం చేయాలో ప్రపంచానికి బైజూస్ రవీంద్రన్ నేర్పించారని ఫార్చూన్ తెలిపింది. బైజూస్ లక్షలాదిమంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఉపయోగపడిందని తెలిపింది. 2011లో ఏర్పాటైన బైజూస్ గతంలో 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించిందని, ఇప్పుడు 10 బిలియన్ డాలర్ల వ్యాల్యూ కలిగి ఉందని తెలిపింది.
వీరు కూడా..
ఈ జాబితాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా గురించి ఫార్చూన్ ప్రస్తావిస్తూ అతిపెద్ద వ్యాక్సీన్ల తయారీ కంపెనీకి సీఈవోగా ప్రస్తుత పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో షావోమీ ఇండియా ఎండీ మనుకుమార్(39), సాఫ్టుబ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ నెహతా(39, టీడీ అమరిట్ ట్రేడ్ డీఎల్టీ హెడ్ సునయన తుతేజా, మావెరిక్ వెంచర్స్ ఎండీ అంబర్ భట్టాచార్య, పార్మ్-ఈజీ సహ వ్యవస్థాపకులు దావల్ షా, ధర్మిల్ సేథ్, ఏసీఎల్యూ చీఫ్ ప్రోడక్ట్ అండ్ డిజిటల్ ఆఫీసర్ దీపా సుబ్రమణియన్ ఉన్నారు.