ఐఆర్సీటీసీ నుంచి అదిరిపోయే ఆఫర్.. ‘హైదరాబాద్-దుబాయ్ టూర్’!
భారతీయ రైల్వేకు చెందిన రైల్వే ఈ-టికెటింగ్ ప్లాట్ఫామ్ 'ఐఆర్సీటీసీ' తాజాగా ఓ అదిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'స్ప్లెండర్స్ ఆఫ్ దుబాయ్' పేరిట అద్బుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది.రానుపోను విమాన టిక్కెట్లు, వీసా ఫీజు, హోటల్ స్టే, ఫుడ్, సైట్ సీయింగ్ ఎంట్రెన్స్ టిక్కెట్ల ఖర్చులు కూడా ఐఆర్సీటీసీనే భరిస్తుంది. అంతేకాదు, పర్యాటకులకు ఉచితంగా 'ప్రయాణ బీమా'ను కూడా అందిస్తోంది. మరి ఇంకేంటి.. దుబాయ్ చూసి వస్తారా?
5 రోజుల దుబాయ్ టూర్...
ఐఆర్సీటీసీ ‘స్ప్లెండర్స్ ఆఫ్ దుబాయ్' టూరు మొత్తం 5 రోజులపాటు సాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.61,950 (ట్రిపుల్ ఆక్యుపెన్సీ ఇన్ కంఫర్ట్ క్లాస్), రూ.62,400 (డబుల్ ఆక్యుపెన్సీ), రూ.70,010 (సింగిల్ ఆక్యుపెన్సీ). అయితే ఈ టూర్ కేవలం 25 మందికే. డిసెంబర్ 2, 2019, ఫిబ్రవరి 3, 2020, మార్చి 8, 2020.. ఈ మూడు తేదీల్లో ఈ టూర్ ఉంటుంది. పర్యాటకులు ఏదో ఒక తేదీని ఎంచుకోవచ్చు.
తొలిరోజున శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి...
ఈ హైదరాబాద్-దుబాయ్ టూర్ హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రారంభమవుతుంది. తొలిరోజు ఉదయం 10 గంటలకు విమానం ఉంటుంది. ఈ విమానం నేరుగా దుబాయ్ విమానాశ్రయంలో 12.25 గంటలకు దించుతుంది. లంచ్ అయిపోయిన తరువాత హోటల్కు తీసుకెళతారు. ఈవెనింగ్ డెజర్ట్ సఫారీకి వెళ్లొచ్చు. రాత్రికి అక్కడే బార్బీ క్యూ డిన్నర్ కూడా ఉంటుంది.
సెకండ్ డే టూర్ ఇలా...
రెండో రోజు ఉదయం హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత దుబాయ్ సిటీ టూర్ ఉంటుంది. ఇందులో దుబాయ్ మ్యూజియం వంటివి చూడొచ్చు. అలాగే బుర్జ్ ఖలీఫాలో లైట్ అండ్ షో ఉంటుంది. ఇది చూశాక తిరిగి రాత్రికి బస చేసేందుకు హోటల్కు తీసుకొస్తారు.
థర్డ్ డే సైట్ సీయింగ్...
మూడు రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం పర్యాటకులను అబుదాబి తీసుకెళతారు. అక్కడ వివిధ సందర్శనీయ స్థలాలన్నీ చూపిస్తారు. లంచ్ అక్కడే ఉంటుంది. సైట్ సీయింగ్ అనంతరం తిరిగి రాత్రి హోటల్కు తీసుకొస్తారు. సైట్ సీయింగ్కు వెళ్లినప్పుడు వివిధ ప్రదేశాల గురించి పర్యాటకులకు వివరించేందుకు ఆంగ్లం తెలిసిన గైడ్ ఒకరు ఉంటారు.
ఫోర్త్ డే ‘షాపింగ్'...
నాలుగో రోజు పర్యాటకులందరినీ దుబాయ్లోనే షాపింగ్ చేసేందుకు తీసుకెళతారు. ఆ రోజు రాత్రే విమానాశ్రయానికి చేరుకుని అక్కడ 9.45 గంటలకు విమానం ఎక్కి మర్నాడు తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగుతారు. ఇదీ ఐఆర్సీటీసీ అందిస్తోన్న ‘స్పెండర్స్ ఆఫ్ దుబాయ్' టూర్ ప్యాకేజీ.
అన్నీ ఐఆర్సీటీసీయే చూసుకుంటుంది...
ఈ ‘స్పెండర్స్ ఆఫ్ దుబాయ్' టూర్ ప్యాకేజీకి సంబంధించి రానుపోను విమాన టిక్కెట్లు, హోటల్ స్టే, ఫుడ్తోపాటుగా బుర్జ్ ఖలీఫా, గ్లోబల్ విలేజ్, మిరాకిల్ గార్డెన్ తదితర సైట్ సీయింగ్ ఎంట్రెన్స్ టిక్కెట్ల ఖర్చులు అన్నీ కూడా ఐఆర్సీటీసీనే భరిస్తుంది. అంతేకాదు, పర్యాటకులకు ఉచిత ‘ప్రయాణ బీమా'ను కూడా అందిస్తోంది.