Indian Railways: రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. డబ్బు రిఫండ్ పేరుతో కొత్త మోసాలు.. పూర్తి వివరాలు..
Ticket Refund Fraud: డిజిటల్ యుగంలో మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా తయారయ్యాయి పరిస్థితులు. అవును ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు, డెబిట్ క్రెడిట్ కార్డుల మోసాలకు పాల్పడే సైబర్ కేటుగాళ్లు తాజాగా రైల్వే ప్రయాణికులపై కన్నేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావటంతో భారతీయ రైల్వేస్ ప్రయాణికులను జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. అసలు నయా మోసం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
|
మోసం ఇలా జరుగుతోంది..
టికెట్ డబ్బు వాపసు ప్రక్రియ పేరుతో జరిగే మోసాలు తాజాగా వెలుగులోకి రావటంతో భారతీయ రైల్వే సంస్థ రైలు ప్రయాణికులను హెచ్చరించింది. ఎలాంటి అనుమానాస్పద కాల్స్ లేదా లింక్లు వచ్చినా వాటిని క్లిక్ చేయవద్దని, వాటికి స్పందించవద్దని రైల్వే అధికారులు ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. ఇవి ఆర్థిక మోసాలకు కారణంగా మారుతున్నాయని రైల్వే గుర్తించింది. ఈ మధ్యకాలంలో వీటికి సంబంధించి అనేక కేసులు వెలుగులోకి రావటంతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. టికెట్ల కొనుగోళ్ల కోసం ఈ రోజుల్లో ప్రజలు యూపీఐ చెల్లింపులు చేస్తున్నందున సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు ఈ మార్గాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నట్లు తెలిపింది.
నేరగాళ్ల నుంచి కాల్స్..
ఒక వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావటంతో దానిని ట్విట్టర్ ద్వారా రైల్వే సేవకు వెల్లడించాడు. తనకు IRCTCకి చెందిన వ్యక్తినంటూ ఒక ఫ్రాడ్ కాల్ వచ్చిందని వెల్లడించాడు. కాల్ చేసిన వ్యక్తి టిక్కెట్ అమౌంట్ రీఫండ్ కోసం బ్యాంక్ వివరాలను అడిగినట్లు తెలిపాడు. దీనికి తోడు UPI IDని కూడా అడిగినట్లు చెప్పాడు. IRCTC ఎప్పుడూ వినియోగదారులను ఇలాంటి వివరాల గురించి అడగదని సదరు వ్యక్తికి అవగాహన ఉంది. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని.. ఎట్టిపరిస్థితుల్లోనూ కీలక సమాచారాన్ని పంచుకోవద్దని తన ట్వీట్ లో జోడించాడు. ఇందులో తనకు వచ్చిన కాల్ స్కీన్ షాట్ కూడా షేర్ చేశాడు.
|
IRCTC స్పందన..
రైల్వే అధికారులు దీనిపై తక్షణమే చర్య తీసుకున్నారు. సదరు వ్యక్తిని PNR నంబర్ను షేర్ చేయవలసిందిగా IRCTC కోరింది. అధికారులు అతని ఫిర్యాదు స్థితిని ట్రాక్ చేయగల లింక్తో అతనికి సహాయం చేశారు. ఇలాంటి మోసపూరిత కాల్స్, మెసేజ్ లింక్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భారతీయ రైల్వేస్ కోరింది. దీనికి ప్రతి స్పందిస్తూ.. ట్విట్టర్ ఫాలోవర్లు తమ బుకింగ్, రీఫండ్/టీడీఆర్, టీఎక్స్ఎన్ -ఐఆర్సీటీసీ అఫీషియల్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్న వారిని నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపింది. IRCTC రీఫండ్ ప్రక్రియ పూర్తిగా ఆటోమెటిక్ గా జరుగుతుందని, ఎలాంటి మానవ జోక్యం ఉందని వెల్లడించింది.
ఈ విషయాలు అస్సలు షేర్ చేయకండి..
ముందుజాగ్రత్త చర్యగా కస్టమర్లను మరింత అప్రమత్తం చేయడానికి IRCTC తన వెబ్సైట్లో హెచ్చరికను ఉంచింది. అందులో వెల్లడించిన వివరాల ప్రకారం.. టికెట్ డబ్బు రిఫండ్ విషయంలో రైల్వే ఉద్యోగుల పాత్ర ఉండదని, వారు ప్రయాణికులకు ఎలాంటి కాల్స్ చేయరని స్పష్టం చేసింది. ప్రయాణికులకు సంబంధించి డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్, OTP/ATMలకు సంబంధించి ఎలాంటి వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని అడగరని తెలిపింది. వీటికి తోడు పాన్, ఆధార్ వంటి సమాచారం కూడా అపరిచితుల నుంచి వచ్చిన కాల్స్ లో వెల్లడించవద్దని సూచించింది.