ముంబైలో ఒలింపిక్ సెషన్స్: నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు
ముంబై: క్రీడారంగంలో అత్యున్నతమైన ఈవెంట్గా భావించే ఒలింపిక్స్ సెషన్ 2023లో భారత్లో ఏర్పాటు కానుంది. ముంబై దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 40 సంవత్సరాల తరువాత భారత్లో ఈ సెషన్ ఏర్పాటు కాబోతోండటం ఇదే తొలిసారి. ఈ సెషన్స్ నిర్వహించడానికి అవసరమైన హక్కులను భారత్ సొంతం చేసుకుంది. చైనా రాజధాని బీజింగ్లో నిర్వహించిన ఓటింగ్ సందర్భంగా మెజారిటీ సభ్యులు ముంబై వైపు మొగ్గు చూపారు. ముంబైలో నిర్వహించడానికి అనుకూలంగా ఓటు వేశారు.
బీజింగ్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ, అధ్యక్షుడు నరీందర్ బత్రా, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఇది 139వ ఐఓసీ సెషన్. ఈ ఒలింపిక్ నిర్వహణ కమిటీ సమావేశాలకు ఆతిథ్యాన్ని ఇచ్చే హక్కులను భారత్ గెలుచుకోవడం పట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు.
భారత్లో ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ దిశగా తొలి అడుగు పడినట్టయిందని వ్యాఖ్యానించారు. ఈ అత్యుత్తమ స్పోర్ట్స్ ఈవెంట్ను నిర్వహించే సామర్థ్యం భారత్కు ఉందని ఐఓసీ అభిప్రాయపడినట్టయిందని పేర్కొన్నారు. ఇక మలి అడుగు ఒలింపిక్స్ నిర్వహణ దిశగా పడుతుందనే ఆత్మవిశ్వాసాన్ని నీతా అంబానీ వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ సెషన్స్ను భారత్లో విజయవంతంగా నిర్వహించగలుగుతామనే నమ్మకం ఉందని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఇదో దిక్సూచిగా మారుతుందని అన్నారు.
ఐఓసీ సెషన్స్ను భారత్లో నిర్వహించడం ఇది రెండోసారి. ఇదివరకు 1983లో తొలిసారిగా ఈ సెషన్స్ భారత్లో ఏర్పాటైంది. ఐఓసీలో మొత్తం 101 మంది సభ్యులు ఉన్నారు. అదనంగా మరో 45 మంది గౌరవ సభ్యులు ఉంటారు. ముంబైలో ఐఓసీ సెషన్ నిర్వహణ కోసం అవకాశం ఇచ్చినందుకు నీతా అంబానీ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాది మందికి ఈ సెషన్స్ ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.