7 సెషన్లు, రూ.22 లక్షల కోట్ల సంపద గాయబ్: నేడు ఒక్కరోజే రూ.4.5 లక్షల కోట్లు పతనం
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్కు ముందు మార్కెట్లు భారీ దిద్దుబాటుకు లోనవుతున్నాయి. గతవారం 2000 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్, ఈ వారం మొదటి రోజునే 1545 పాయింట్ల నష్టంతో ఆరంభించింది. అయితే మంగళవారం 367 పాయింట్ల మేర లాభపడి ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చింది. అయితే అంతలోనే నేడు మళ్లీ 1300 పాయింట్ల మేర కుప్పకూలింది. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ వారం మూడు సెషన్లలో రెండు సెషన్లలో 300 పాయింట్లకు పైగా నష్టపోయింది.
రూ.4 లక్షల కోట్లకు పైగా పతనం
సెన్సెక్స్ నేడు మధ్యాహ్నం గం.12.20 సమయానికి 1405 పాయింట్లు నష్టపోయి 56,453 పాయింట్ల వద్ద, నిఫ్టీ 406 పాయింట్లు క్షీణించి 16,871 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ ఒక్కరోజే సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర పడిపోవడంతో బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ క్యాప్ భారీగా పడిపోయింది. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.4.5 లక్షల కోట్లు నష్టపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం నాటి రూ.262 లక్షల కోట్ల నుండి రూ.258 లక్షల కోట్లకు తగ్గింది.
అందుకే కుప్పకూలుతున్న స్టాక్స్
అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల కోసం ప్రపంచమంతా ఎదురు చూసింది. వడ్డీ రేట్లు పెంచుతామని ఫెడ్ ప్రకటించింది. అలాగే, అమెరికాలో ద్రవ్యోల్భణం గరిష్టస్థాయిలో ఉన్నప్పటికీ, జాబ్ మార్కెట్ బలంగా కనిపిస్తోంది. అందుకే వడ్డీ రేట్ల పెంపుకు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలోపు వడ్డీ రేట్లు 0.25 శాతం పెరగవచ్చు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ చమురు 90 డాలర్లు క్రాస్ చేసింది. కొద్ది రోజుల్లో వంద డాలర్లు క్రాస్ చేయవచ్చు. ఇది కూడా మార్కెట్ పైన ప్రభావం చూపవచ్చు. బడ్జెట్కు ముందు మార్కెట్లు ఉత్తానపతనాలను చూడటం ఎప్పుడు జరిగేది. రష్యా-ఉగ్రెయిన్ ఉద్రిక్తతలు ప్రభావం చూపుతున్నాయి. కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించాయి. ఇవి ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేదు. దీంతో ఈ స్టాక్స్ కుప్పకూలుతున్నాయి.
రూ.22 లక్షల కోట్లు ఫట్
జనవరి 17వ తేదీన రూ.280 లక్షల కోట్లుగా ఉన్న ఇన్వెస్టర్ల సంపద ఇప్పుడు రూ.258 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఏడు సెషన్లలో ఏకంగా రూ.22 లక్షల కోట్లు క్షీణించింది. గతవారం సోమవారం మార్కెట్ అతి స్వల్ప లాభాల్లో ముగిసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు రోజులు 2000 పాయింట్లకు పైగా క్షీణించింది.
ఈ వారంలో సోమవారం 1550 పాయింట్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత 367 పాయింట్లు లాభపడింది. కానీ నేడు మళ్లీ 1400 పాయింట్లకు పైగా నష్టపోయింది. అంటే ఈ ఏడు సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 5000 పాయింట్లు నష్టపోయింది. అయితే 1400 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, గం.12.30 సమయానికి 1269 పాయింట్ల నష్టానికి తగ్గింది.