ఇంటర్నెట్ షట్డౌన్తో.. టెల్కోలకు గంటకు రూ.2.5 కోట్ల నష్టం!
దేశంలో ఎక్కడ నిరసనలు, ఆందోళనలు జరిగినా దాని ప్రభావం ముందుగా అంతర్జాలం(ఇంటర్నెట్)పై పడుతోంది. అల్లర్లు జరిగిన ప్రతీసారి ఇంటర్నెట్ షట్డౌన్ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికే ఇలా చేస్తున్నట్లు సమర్థించుకుంటోంది.
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యపై నెటిజన్ల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. దేశంలోని పౌరులకు ఉండే ఒక సదుపాయాన్ని ఇలా తరచూ రద్దు చేయడం కూడా ప్రాథమిక హక్కుని కాలరాయడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఈ చర్య కారణంగా టెలికాం కంపెనీలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్ షట్డౌన్ చేసినప్పుడల్లా నెట్వర్క్ కంపెనీలకు గంటకు దాదాపు రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీవోఏఐ) ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యాస్ తాజాగా వెల్లడించారు.
ఈ ఏడాది 100 సార్లకుపైగా...
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. ఇంటర్నెట్ నిలిపివేతతో ఫేస్బుక్, వాట్సాప్, టిక్టాక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తిని అరికట్టవచ్చనేది ప్రభుత్వం వాదన. తాజాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో 21 జిల్లాల్లో 24 గంటలపాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం కూడా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే అస్సాం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్లో ఇప్పటికే చాలాసార్లు ఇంటర్నెట్ షట్డౌన్ చేశారు.
తొలిసారిగా 2010లో...
దేశంలో తొలిసారిగా 2010లో గణతంత్ర వేడుకలకు ముందు కశ్మీర్ లోయ ప్రాంతంలో ఇంటర్నెట్, ఫోన్ సేవలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. 2012 నాటికి కశ్మీర్లో ఒకట్రెండు జిల్లాలకే పరిమితమైన ఈ ఇంటర్నెట్ షట్డౌన్ అనేది 2019 వచ్చేసరికి 14 రాష్ట్రాలకు పాకింది. 2012 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు దేశంలో 370 సార్లకుపైగానే ప్రభుత్వం ఇంటర్నెట్ షట్డౌన్ చేసింది. అంతేకాదు, ఇలా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం వల్ల భారత్కి 2012-2017 మధ్య 300 కోట్ల డాలర్లకుపైగా నష్టం వాటిల్లినట్లు ఓ అంచనా.
ఇంకా ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ అంటే...
2015లో గుజరాత్లో పటీదార్ల ‘రిజర్వేషన్'ల ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. 2016లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్లో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఆందోళనలు ఉధృతంగా ఉన్నపుడు 100 రోజులు ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేశారు. 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని సైన్యం మట్టుబెట్టాక కశ్మీర్తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి.
ఈ ఏడాది ఇప్పటి వరకు....
ఈ ఏడాది ఆగస్టు 5న.. జమ్మూ, కశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినపుడు కూడా కశ్మీర్లో ఇంటర్నెట్ షట్డౌన్ చేశారు. అక్కడ నేటికీ చాలా ప్రాంతాల్లో ఈ సేవలను పునరుద్ధరించలేదు. ఇటీవల వివాదాస్పద బాబ్రీమసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించడానికి ముందు కూడా ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. ఇక తాజాగా
డిసెంబర్ 19న దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ షట్డౌన్ జరిగింది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని 18 జిల్లాల్లో 24 గంటల పాటు ఇంటర్నెట్ నిలిపివేశారు.
టెలికాం కంపెనీలకు తీవ్ర నష్టం...
ప్రభుత్వం తరచూ ఇంటర్నెట్ షట్డౌన్ చేయడం వల్ల టెలికాం కంపెనీలు భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి. గంటకు దాదాపు రూ.2.5 కోట్లు నష్టపోతున్నట్టు సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీవోఏఐ) ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వెల్లడించారు. సీవోఏఐలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సభ్యులుగా ఉన్నాయి. ఓ అధ్యయనం ప్రకారం ఇండియాలో సగటు ఇంటర్నెట్ వినియోగం నెలకు 10 జీబీ. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతేకాకుండా వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్మీడియా యాప్లకు భారత్ అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగిన డేటా వినియోగం ప్రకారం టెల్కోలకు జరుగుతున్న నష్టాన్ని లెక్కిస్తే ఇంచుమించుగా గంటకు రూ.2.5 కోట్లుగా తేలినట్లు రాజన్ మాథ్యూస్ వివరించారు.
కేంద్రంపై నెటిజన్ల అసహనం...
ఈ ఏడాది కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, అలాగే ఇటీవల దేశ పౌరసత్వ చట్టానికి సవరణ సందర్భంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో కేంద్రం పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ షట్డౌన్ చేసిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తాజాగా ఉత్తరప్రదేశ్లో 18 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని 24 గంటలపాటు నిలిపివేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే అస్సాం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్లో చాలాసార్లు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఇలా దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ షట్డౌన్ జరుగుతుండడంపై దేశంలోని నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ కూడా పౌరుల ప్రాథమిక హక్కేనన్న కేరళ హైకోర్టు తీర్పును వారు ఉటంకిస్తున్నారు.