హైదరాబాద్లో ఇంటెల్ AI రీసెర్చ్ సెంటర్: కేటీఆర్ ఏమన్నారంటే?
టెక్ దిగ్గజం ఇంటెల్ ఇండియా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఐఐఐటీ హైదరాబాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(PHFI), తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. హెల్త్ కేర్, స్మార్ట్ మొబిలిటీ వంటి కీలక రంగాల్లో సవాళ్ళను పరిష్కరించడంపై దృష్టి సారిస్తారు. సోమవారం ఆల్.ఏఐ 2020 వర్చువల్ సదస్సులో భాగంగా ఐఎన్ఏఐ కేంద్రాన్ని ప్రారంభించింది.

స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు..
సామాజికాభివృద్ధి కోసం ప్రపంచ ప్రతిభను ఆకర్షించడం కోసం ఏఐలో సరికొత్త ఆవిష్కరణలు, క్యూరేటెడ్ డేటా సెట్స్, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టార్టప్ వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో ఇది అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. పరిశ్రమలు, విద్యాసంస్థలు,ప్రభుత్వ సహకారంతో భారత్ కృత్రిమ మేధ రంగంలో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు ఐఎన్ఏఐ తోడ్పడుతుందని ఇంటెల్ తెలిపింది. అప్లైడ్ పరిశోధన, ఆధునాతన కృత్రిమ మేధ తదితరాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పడటమే దీని లక్ష్యమని తెలిపింది.

టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న భారత్
భారత్ సరికొత్త టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటోందని, ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్ మొబిలిటీ రంగాల్లోని అనేక సమస్యల పరిష్కారానికి ఇది అవసరమని ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్, ఇంటెల్ కార్పోరేషన్ డేటా ప్లాట్ఫామ్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నివృతి రాయ్ అన్నారు. అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు ద్వారా భారత్ను ఏఐకి మారుపేరుగా చేసే ప్రయత్నమన్నారు.

కీలక మైలురాయి.. కేటీఆర్
హైదరాబాద్ నగరంలో కృత్రిమ మేధస్సు పరిశోధనా కేంద్రం ఐఎన్ఏఐ ప్రారంభం మన సాంకేతికీకరణ ప్రయాణంలో మరో మైలురాయి అని ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు, అత్యుత్తమ పాలన అందించడం కోసం ఇది అవసరమన్నారు. మన కృత్రిమ మేధ దృక్పథం సాకారానికి సమకాలిక ప్రయత్నంతో కలిసి పని చేసేందుకు ఈ సెంటర్ అందరికీ ముఖ్యమని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications