Covishield..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాక్సిన్: సీరమ్ ఇన్స్టిట్యూట్ క్లారిటీ ఇదీ
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు సహా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ స్టార్లు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను దూరం చేయడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 13,83,79,832 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.
కోవిషీల్డ్ రేటుపై
కాగా- కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు ధరను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇటీవలే నిర్ధారించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధరను ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు హాస్పిటల్స్లో వేర్వేరుగా వసూలు చేసేలా ఖరారు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర డోసు ఒక్కింటికి 400 రూపాయలను వసూలు చేస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో దాని ధర 600 రూపాయలుగా నిర్ధారించారు. ఇతర దేశాల్లో అమల్లో ఉన్న రేట్ల కంటే తక్కువకే కోవిషీల్డ్ వ్యాక్సిన్ను అందిస్తున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అదార్ పునావాలా వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
|
అత్యంత ఖరీదైనదిగా..
ప్రైవేటు ఆసుపత్రులకు నిర్ధారించిన డోసుకు 600 రూపాయల ధర ప్రస్తుతం చర్చనీయాంశమౌతోంది. ఎందుకంటే- ప్రపంచంలో దీన్ని మించిన రేటు మరొకటి లేదు. ఈ 600 రూపాయల రేటును డాలర్లతో పోల్చుకుని చూస్తే.. ఎనిమిది డాలర్లకు పైగా ఉంటుంది. అత్యంత ధనిక దేశమైన సౌదీ అరేబియాలో వ్యాక్సిన్ ధర 5.25 డాలర్లు ఉంటోంది. భారత్ తరువాత ఇదే అత్యధిక రేటు. దక్షిణాఫ్రికా-5.25, అమెరికా-4, బంగ్లాదేశ్-4, బ్రెజిల్-3.15, యునైటెడ్ కింగ్డమ్-3 డాలర్ల మేర పలుకుతోంది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ధర 2.15 నుంచి 3.50 డాలర్లుగా ఉంటోంది.
వ్యాక్సిన్ ధర అధికంగా ఉండటంపై
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఒకటిన్నర రెట్లు అధికంగా ఉందంటూ వచ్చిన వార్తలపై ఆదార్ పూనావాలా స్పందించారు. ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రారంభంలో నిర్దారించిన రేటు.. అడ్వాన్స్ ఫండింగ్ను ఆధారంగా చేసుకున్నదని, తాజాగా ఖరారు చేసిన ధర పెట్టుబడులు, మరిన్ని వ్యాక్సిన్లను యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి చేయడానికి తీసుకున్న చర్యలు, ఉత్పాదకత పెంపుదల, కంపెనీ విస్తరించడానికి చేసిన ఖర్చులపై ఆధారపడి రూపొందించినదని వివరణ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ధరతో దీన్ని పోల్చలేమని చెప్పుకొచ్చారు. కోవిషీల్డ్ అత్యంత ప్రభావశీలమైన వ్యాక్సిన్గా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
ఇప్పటికీ తక్కువ రేటు అదొక్కటే..
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన భారత్ సహా అన్ని దేశాల ప్రభుత్వాలకు తాము సరఫరా చేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రారంభ ధర.. ఇప్పటికీ తక్కువేనని పూనావాలా స్పష్టం చేశారు. కరోనా వైరస్ తన రూపాన్ని, మ్యూటెంట్ను మార్చుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు ఇప్పటికీ.. ప్రమాదంలోనే ఉందని, దానికి అనుగుణంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ పరిస్థతుల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి విస్తరణ కార్యకలాపాలను చేపట్టామని ఆయన వివరణ ఇచ్చారు.