రానున్న రెండేళ్లలో అంటే 2022 నాటికి అమెరికాలో 12,000 మంది స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. వచ్చే అయిదు సంవత్సరాలలో 25వేల మందిని నియమించుకుంటామని మంగళవారం తెలిపింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఐటీ కంపెనీలు మరింతమంది స్థానికులను నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయిదేళ్లలో ఇరవై ఐదువేల మందిని అమెరికాలో నియమించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

వాటికి అదనంగా 12000 ఉద్యోగాలు
అమెరికన్లకు రెండేళ్లలో 10వేల ఉద్యోగాలు ఇవ్వాలని 2017లో తొలుత ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ఆ తర్వాత 13000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు వీటికి అదనంగా మరో పన్నెండు వేలమందిని తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఎక్స్పీరియన్స్ కలిగిన వృత్తి నిపుణులతో పాటు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుండి తాజా పట్టభద్రులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ఐటీ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగులను తీసుకునే విషయం తెలిసిందే.

ట్రంప్ ఎఫెక్ట్
H1B వీసాదారులకు వర్క్ వీసాలకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ ప్రకటన చేసింది. 2020 జూన్ క్వార్టర్ చివరి నాటికి ఇన్ఫోసిస్లో 2,39,233 మంది ఉద్యోగులు ఉన్నారు. గత మూడేళ్లుగా అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇన్పోసిస్ దృష్టి సారించింది. ఈ సంఖ్యను మరింతగా పెంచనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

భారీగా పెరిగిన తిరస్కరణ రేటు
ఐటీ సేవల కంపెనీలకు చెందిన హెచ్1బీ వీసాలు రెండో క్వార్టర్లో పెద్ద ఎత్తున తిరస్కరణకు గురయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికాలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగిత రేటు ఓ సమయంలో 29 శాతానికి చేరుకుంది. ఈ సమయంలో అమెరికన్లకు ఉద్యోగాల కోసం ట్రంప్ పరిపాలనా విభాగం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీల హెచ్1బీ వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది అక్టోబర్-మార్చి 2020 మధ్య ఇన్ఫోసిస్కు చెందిన 59 శాతం తిరస్కరణకు గురయ్యాయి. 2015లో ఇన్ఫోసిస్ కేవలం 2 శాతంతో ఉంది. టీసీఎస్ 15 శాతంతో పెద్దగా మార్పు లేదు. 52 శాతంతో కాగ్నిజెంట్ రెండో స్థానంలో ఉంది. 2015లో కాగ్నిజెంట్ తిరస్కరణ శాతం 8 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications