ఐటీ పోర్టల్ ఇష్యూ, ఇన్ఫోసిస్కు ఇచ్చిన గడువు ముగిసింది.. కానీ
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన గడువు నేటితో ముగుస్తోంది. కొత్త ఐటీ పోర్టల్ను ప్రారంభించి మూడు నెలలు దాటింది. అయినప్పటికీ ఇంకా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఐటీ పోర్టల్లో సమస్యలను గుర్తించిన ఐటీ శాఖ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 15వ తేదీలోగా సమస్య పరిష్కారం కావాలని ఇన్ఫోసిస్కు గడువు ఇచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా పోర్టల్లో సమస్యలు తలెత్తుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి.
జూన్ 7వ తేదీన ప్రారంభించిన ఐటీ పోర్టల్ కాంట్రాక్ట్ ఇన్ఫోసిస్కు దక్కింది. పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచ్చినప్పటికీ, పలు సమస్యలు తలెత్తుతున్నాయి. పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆగస్ట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సమస్యలపై ఇన్ఫోసిస్ను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఫరేఖ్కు సమన్లు జారీ చేసి వివరణ అడిగింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఇన్ఫోసిస్కు నేటి వరకు గడువు ఇచ్చింది. కానీ పరిష్కారమైనట్లుగా కనిపించడం లేదని అంటున్నారు.
ఇప్పటికే ఇన్ఫోసిస్ 750 మంది టెక్నికల్ నిపుణులను ఇందుకోసం కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ వ్యాల్యూ రూ.4వేల కోట్లు. పోర్టల్ ప్రారంభం నుండి సాంకేతిక సమస్యలు, ఎర్రర్స్, పోర్టల్ వినియోగంలో ఇబ్బందులు, చాలా ఆప్షన్స్ పని చేయకపోవడం జరిగాయి. దాదాపు నెల క్రితం సలీల్ పరేఖ్ ఆర్థికమంత్రి నిర్మలతో భేటీ అయ్యారు. పోర్టల్ ప్రారంభం నుండి రూ.4241 కోట్లు ఖర్చు చేశామని, నాటి నుండి నేటి వరకు సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలలుగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఐటీ పోర్టల్లో సమస్య నేపథ్యంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ తుది గడువును కూడా పొడిగించారు.
కొత్త పోర్టల్లో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించాలనే విజ్ఞప్తులు వచ్చాయి. సమస్యను గుర్తించిన సీబీడీటీ కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించడానికి మొగ్గు చూపింది. ఐటీ రిటర్న్స్ తుది గడువును మొదట సెప్టెంబర్ చివరి వరకు పొడిగించింది. సమస్య పరిష్కారం కాకపోయేసరికి ఇటీవలే డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అయితే ఆలస్యమయ్యే ప్రతి నెలకు కొంత మొత్తం అదనంగా చెల్లించాలి.
కాగా, ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం గడువులోగా కొన్ని పనులు పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(FY22) గడిచిన ఐదు నెలల్లో ఎన్నో గడువులు ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం పలు గడువులను పొడిగించింది. ఐటీ రిటర్న్స్ గడువు, ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్స్ గడువు వంటి వాటిని ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు పూర్తి చేయాల్సిన పలు అంశాలు ఉన్నాయి.
ఐటీ రిటర్న్స్ గడువు ఇటీవలి వరకు సెప్టెంబర్ 30 వరకు ఉంది. అయితే దీనిని డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఐటీ రిటర్న్స్ గడువులోగా దాఖలు చేయకుంటే రూ.5 వేల లేట్ ఫీజుతో దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.5 లక్షలకు మించకపోతే లేట్ ఫీజు రూ.1000 కంటే ఎక్కువగా ఉండదు.