అలా అయితే ... ఐదేళ్ళలో భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ!
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మందగమనంలో పయనిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ చైనాకు కూడా సవాలు విసిరిన మన దేశం.... ఏడాది కాలంగా అంతకంతకూ పడిపోతూ మాంద్యం దిశగా అడుగులు వేస్తోంది. కానీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం భారత్ ను వచ్చే ఐదేళ్లలోనే 5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ 350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని కళలు కంటున్నారు. దీనికి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడి లక్ష్యాన్ని అందుకోవాలంటే... భారత్ చాలా కష్టపడాల్సిందే.
ఎందుకంటే ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కేవలం 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలోనే ఉంది. కేవలం ఐదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు రెట్టింపు కావాల్సి ఉంటుంది. అంటే సగటున ఏటా సుమారు 15% చొప్పున డీజీపీ వృద్ధి చెందాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇండియా జీడీపీ గడిచిన త్రైమాషికంలో 4.5% నికి పడిపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ను ముందుగా గాడిలో పెడుతూనే దానిని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలను అమలు చేయాలో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు చర్చించారు. వారు సూచించిన విధంగా చేస్తే లక్ష్యాన్ని చేరుకోవటం పెద్ద కష్టమేమి కాదని అభిప్రాయపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ దిశగా ముత్తూట్ ఫిన్ కార్ప్...
హేమాహేమీల భేటీ...
భారత ఆర్థిక వ్యవస్థ ను పరుగులు పెట్టించే విధానాలపై చర్చించేందుకు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు. ఇందులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అనిల్ చౌదరి, ఐటీసీ సీఎండీ సంజీవ్ పూరి, కాడిలా హెల్త్ కేర్ చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్, భారతి ఎంట్రప్రెస్స్ వైస్ చైర్మన్ రాజన్ భారతి మిట్టల్, జేకె పేపర్ వైస్ చైర్మన్ అండ్ ఎండి హర్ష పథ్ సింఘానియా తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల సంఘం ఫిక్కీ నిర్వహించిన ఒక సమేవేశానికి హాజరైన ఈ ప్రముఖులు ... ఇండియా: రోడ్ మ్యాప్ టు ఏ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనే అంశంపై చర్చించారు. ఈ విషయాన్నీ ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనంలో వెల్లడించింది.
తయారీ రంగం కీలకం...
ఇండియన్ ఎకానమీ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే ముందుగా భారత్ లో తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలని పారిశ్రామికవేత్తలంతా ముక్తఖంఠంతో చెప్పారు. ఉద్యోగాల కల్పనకు, పెట్టుబడుల ఆకర్షణకూ ఇదే కీలకం అని వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భారత్ ప్రపంచ దేశాలతో ధరలు సహా ఇతర అంశాల్లో పోటీ పడగలిగే స్థాయికి చేరుకోవాలని చెప్పారు. ఐదేళ్ళలో మనం అనుకున్నట్లు 5 ట్రిలియన్ డాలర్ల కు చేరుకోవాలంటే మనం గ్లోబల్ లెవెల్ లో పోటీతత్వాన్ని అలవరచుకోవాలి. అదే సమయంలో దేశం నుంచి జరిగే ఎగుమతులు పెరగాలి. ముఖ్యంగా స్టీల్ ఎగుమతులు అధికంగా జరగాలని పెంచాలని సెయిల్ చైర్మన్ తెలిపారు. దీర్ఘ కాళిక లక్ష్యాలను సాధించాలంటే... పరిశ్రమకు ముందు కావలసింది విధాన స్థిరీకరణ అని కాడిలా చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు మారిపోయే ప్రభుత్వ విధానాలతో పారిశ్రామికవేత్తలు ముందుకు వెళ్లలేరన్నారు. ఇవ్వాళ అనుకొని రేపే ఉత్పత్తులను తయారు చేయలేమని, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. మాటిమాటికీ విధానాలు మారిపొతే కష్టమని ఆయన తెలిపారు.
డిజిటల్ దన్ను...
ప్రపంచమంతా డిజిటల్ టెక్నాలజీల వైపు పరుగులు పెడుతోందని, భారత్ లోనూ ఈ రంగంలో చాలా మార్పులు చోటుచేసుకొంటున్నాయని పారిశ్రామికవేత్తలు చెప్పారు. అందుకే ప్రభుత్వం దేశంలో డిజిటల్ రంగ వెన్నెముక ను బలోపేతం చేసేలా స్థిరమైన, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని భారతి ఎంట్రప్రెస్స్ వైస్ చైర్మన్ సూచించారు. ఈ రంగంలో పరిశ్రమలు ఇప్పటికే డిజిటల్ ప్రభావానికి లోనయ్యాయని, ఇకనైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. దేశానికి ఆహారాన్ని అందించే వ్యవసాయాన్ని ఆదుకోవాలని, ఫుడ్ ప్రాసెసింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ విధానాలు మెరుగ్గా ఉండాలని ఐటీసీ సీఎండీ తెలిపారు. కోట్ల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే వ్యవసాయాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రోత్సహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జేకే పేపర్ అధినేత తయారీ రంగాన్ని ప్రోత్సహించటం ద్వారా భారత్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలదని పేర్కొన్నారు.