రూ.3 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి, ప్రత్యక్ష నగదు బదలీకి సిఫార్స్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మరో ఉద్దీపన ప్యాకేజీని కోరుతున్నాయి వివిధ వర్గాలు. ఫస్ట్ వేవ్ నుండి కోలుకునే సమయంలో సెకండ్ వేవ్ దారుణంగా దెబ్బతీసిందని, ఈ పరిస్థితుల్లో ఆర్థిక ప్యాకేజీ అవసరమని భారత పరిశ్రమల సమాఖ్య(CII) కోరింది. ఈ ఆర్థిక ప్యాకేజీ కనీసం రూ.3 లక్షల కోట్లు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు CII కొత్త అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ అన్నారు. ప్యాకేజీ లేకుంటే ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాట పట్టించడం కష్టమన్నారు. జన్ ధన్ ఖాతాలకు నేరుగా నగదు బదలీ ద్వారా పేదలను ఆదుకోవాలన్నారు. నిధుల లభ్యత పెంచడం ద్వారా ఆర్బీఐ కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
ఇలా చేయకండి.. ఇవి చేయవద్దు: కస్టమర్లకు SBI ఆన్సైన్ బ్యాంకింగ్ టిప్స్
నగదు బదలీతో పాటు మరిన్ని చర్యలు
మరో ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ప్రజలపై ఏర్పడిన ఒత్తిడిని తొలగించడానికి తగిన ఆర్థిక చర్యలు చేపట్టడం తక్షణ కర్తవ్యమని టీవీ నరేంద్రన్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వినియోగ ఆధారితమైనదని, కరోనాతో వినియోగ డిమాండ్ తగ్గినందున దీనినిపెంచేందుకు నగదు బదలీతో పాటు మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
అదనపు ఆర్థిక ప్యాకేజీ...
రూ.3 లక్షల కోట్ల అదనపు ఆర్థిక ఉద్దీపన ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు వీలుగా ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ను పెంచుకోవడం ద్వారా వడ్డీ వ్యయాలను అదుపు చేయవచ్చునని వెల్లడించారు. డిమాండ్ పెంచేందుకు వీలుగా జీఎస్టీని తగ్గించాలన్నారు. ఇళ్ల కొనుగోలుదారులకు పన్ను ప్రోత్సహకాలు, వడ్డీ రాయితీలు, స్టాంప్ డ్యూటీ తగ్గింపులు ఇవ్వాలని,
ఎల్టీసీ నగదు ఓచర్ స్కీంను ప్రవేశ పెట్టాలన్నారు. ఆత్మానిర్భర్ భారత్ రోజ్ గార్ యోజనను 2022 మార్చి వరకు పొడిగించాలని సూచించారు. ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారెంటీ స్కీంను రూ.5 లక్షల కోట్లకు పెంచాలన్నారు. ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని, అలాగే ఇంధన ఉత్పత్తిని జీఎస్టీలో చేర్చాలని తెలిపారు.
వ్యాక్సీనేషన్ వేగవంతం..
వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడానికి బ్రిటన్ తరహాలో వ్యాక్సీన్ జార్ను నియమించాలని, పూర్తి జనాభాకు ఈ ఏడాది డిసెంబర్ వరకు వ్యాక్సీన్ వేయడానికి రోజుకు సగటున 71.2 లక్షల వ్యాక్సీన్ డోస్లు అవసరమని తెలిపారు. వ్యాక్సీన్ ఉత్పత్తి, దిగుమతులు, రాష్ట్రాలకు పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటివి పర్యవేక్షించి, తగిన చర్యలు తీసుకునే అధికారాలను వ్యాక్సీన్ సీజర్కు ఇవ్వాలన్నారు. భారత ఎకానమీ వినియోగ ఆధారితమైనదన్నారు.