ఆసియా అతిపెద్ద బడ్జెట్ క్యారియర్ ఇండిగో లగేజీకి ఛార్జీని విధించనుంది. కరోనా సమయంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్న రంగాల్లో విమానయానం, ఆతిథ్య రంగాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడప్పుడే కోలుకుంటున్నాయి. విమానాల్లో ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విమానయాన రంగంలో పలు విమానయాన సంస్థలు లగేజీని విడదీసి, ప్రత్యేక ఛార్జీని విధించే ఆలోచనలో ఉంది. అప్పుడు లగేజీ లేకుంటే విమాన టిక్కెట్లు కాస్త చౌకగా లభించవచ్చు. ఇప్పటికే గో ఎయిర్ లైన్స్ సంస్థ ఈ దిశగా అడుగులు వేసింది. దేశీయ విమానయాన విపణిలో అగ్రస్థానంలో ఉన్న ఇండిగో కూడా ప్రయాణీకుల టిక్కెట్ ధరను తగ్గించి, చెక్-ఇన్ లగేజీ పైన విడిగా ఛార్జీలు వసూలు చేసే ఆలోచనలో ఉంది. కరోనా పరిణామాల నుండి విమానయానరంగం కోలుకొని, సంస్థలు వంద శాతం సామర్థ్యంతో సర్వీసులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో మళ్లీ ధరల యుద్ధం ప్రారంభం కావొచ్చు.

వారికి టిక్కెట్ ధరలు తక్కువ
సంస్థలు బ్యాగేజీ లేని, చెక్-ఇన్ బ్యాగేజీ లేని ప్రయాణికులకు ప్రత్యేక ఛార్జీలు నిర్ణయించే అవకాశముందని, కొన్ని సేవలకు విడిగా ఛార్జీలు వసూలు చేసుకోవచ్చునని గత ఏడాది ఫిబ్రవరిలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తెలిపింది. అప్పుడు కరోనా విజృంభించడంతో ఛార్జీల విభజన(అన్-బండ్లింగ్ ఆఫ్ ఫేర్స్)ను ఇండిగో అమలు చేయలేదు. సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాక ఛార్జీలు, సీటింగ్ సామర్థ్యంపై పరిమితి విధించడంతో తదుపరి నిర్ణయం తీసుకోలేకపోయినట్లు ఇండిగో సీఈఓ రోనోజాయ్ దత్తా తెలిపారు. తాము ఈ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు పరిస్థితులు సద్దుమణగాలని భావించినట్లు తెలిపారు. ఇప్పుడు విమాన టిక్కెట్ల నుండి బ్యాగేజీ ఛార్జీలను విడదీయడం ద్వారా అందుబాటు ధరలో ఉన్న విమానయాన సంస్థగా మార్చాలన్నది తమ లక్ష్యమన్నారు. ఛార్జీల విభజనతో బ్యాగేజీ లేనివారికి టికెట్ ధరలు తగ్గుతాయన్నారు.

రెవెన్యూ రీబౌండ్
గతంలో అనుకున్న విధంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించి నిధులను సమీకరించే ప్రణాళికలు ప్రస్తుతానికి అమలు చేయడం లేదని తెలిపారు. వెడల్పాటి విమానాలతో లండన్ వంటి అంతర్జాతీయ మార్గాలకు విమానాలను నడిపే ఆలోచన తమకు లేదన్నారు. ఇప్పుడు అటు సర్వీసులు నిర్వహిస్తున్న విస్తారాకు పోటీ వెళ్లదలుచుకోలేదన్నారు. మాస్కో, కైరో, టెల్ అవివ్, నైరోబీ, బాలి, బీజింగ్, మనీలా వంటి నగరాలకు నాన్-స్టాప్ విమాన సేవలు అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

కరోనా ముందుస్థాయికి..
భారత విమానరంగం దేశీయంగా అక్టోబర్ నెలలో ప్రీ-పాండమిక్ కెమాసిటీతో పోలిస్తే 100 శాతం ఆపరేట్ చేసింది. కానీ అంతర్జాతీయ విమానాలు నవంబర్ 30వ తేదీ వరకు రద్దు చేయబడినవి. కరోనా థర్డ్ వేవ్ లేదని, అలాగే, ఆర్థిక రికవరీ పుంజుకుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications