Stock Market: నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాలకు కారణమైన ఐటీ, ఎఫ్ఎమ్సీజీ, బ్యాంకింగ్ స్టాక్స్..
Stock Market Closing: భారీ ఒడిదుడుకుల మధ్య, భారత మార్కెట్లు ఈరోజు సెషన్ను నష్టాల్లోనే ముగించాయి. నాలుగు రోజుల విజయవంతమైన ర్యాలీకి నేడు ఫుల్ స్టాప్ పడింది. కీలక బెంచ్ మార్కె సూచీ సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ సూచీ 51 పాయింట్లు నష్టపోయి 15,800 మార్క్ దిగువన స్థిరపడింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్తో పాటు ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.44 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీ 0.56 శాతం నష్టపోయింది.
నిఫ్టీ-50 ముగింపులో 34 స్టాక్లు క్షీణించగా, 16 లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ అత్యధికంగా 5 శాతం క్షీణించి టాప్ లూజర్గా నిలిచింది. ఇదే క్రమంలో హెచ్యూఎల్ దాదాపు 4 శాతం, అపోలో హాస్పిటల్ దాదాపు 3.5 శాతం క్షీణించగా, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్స్యూమర్, బజాజ్ ఫిన్సర్వ్ 2-3 శాతం చొప్పున క్షీణించాయి. ఇదే సమయంలో ఓఎన్జీసీ లాభాల్లో ర్యాలీని కొనసాగించింది. ఎన్టీపీసీ, రిలయన్స్, కోల్ ఇండియా షేర్లు సైతం మంచి లాభాల్లోనే ముగిశాయి.
కేంద్రం కొన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం కారణంగా ఎఫ్ఎమ్సీజీ రంగంలోని స్టాక్స్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ రోజు సెషన్లో మార్కెట్లు ఒడిదుడుకులతో ట్రేడయ్యాయి. ఉదయం దాదాపు 500 పాయింట్ల మేర మార్కెట్లు నష్టపోయాయి. కానీ క్లోజింగ్ సమయానికి కొంత కోలుకున్నాయని చెప్పుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు ప్రారంభ ట్రేడ్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. ఇది మార్కెట్ల గ్యాప్-డౌన్ ప్రారంభానికి కారణంగా నిలిచింది.