భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ ట్రాక్లోకి వస్తోంది, కానీ సవాళ్లున్నాయి: ఎస్ అండ్ పీ
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ ట్రాక్లో ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుండి రికవరీ మరింతగా పుంజుకునే దిశగా కనిపిస్తోందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధి, కరోనా వ్యాప్తి తగ్గుముఖం, ప్రముఖ వ్యయం పెరగడం వంటివి ఇందుకు దోహదం చేశాయని తెలిపింది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దన్నుగా నిలుస్తోందని పేర్కొంది.
అర్ధరాత్రి నుండి తప్పనిసరి, FASTag లేకుంటే డబుల్ ఛార్జ్
ప్రతికూలతలు
భారత ఆర్థిక వ్యవస్థను మెరుగైనస్థాయిలో పెట్టడానికి ఇంకా అనేక చర్యలు చేపట్టాల్సి ఉందని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. దేశంలో ప్రతి ఒక్కరికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ అందించాల్సి ఉందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ కనిపిస్తున్నప్పటికీ, దీనికి ప్రతికూలత ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. కరోనా కొత్త కొత్త రకాలతో వస్తోందని, ఇది సవాల్ విసిరే ప్రమాదం ఉందని తెలిపింది. ఇప్పటికే ఉన్న వ్యాక్సీన్ కొత్త రకం కరోనాపై పని చేయకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని తెలిపింది.
తయారీ లోటు
ప్రస్తుతం రికవరీ బాటలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని ఎస్ అండ్ పీ పేర్కొంది. కరోనా ముందుస్థాయి పరిస్థితులతో పోలిస్తే భారత్ కొంత ఉత్పత్తి సామర్థ్యాన్ని శాశ్వతంగా కోల్పోనుందని పేర్కొంది. జీడీపీలో 10 శాతానికి సమానమైన తయారీ లోటు దీర్ఘకాలం కొనసాగుతుందని పేర్కొంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత బ్యాంకింగ్ వ్యవస్థకు ఆర్బీఐ, కేంద్రం చర్యలు అండగా నిలిచినట్లు చెప్పారు.
2021లో వృద్ధి
వచ్చే కొన్నేళ్లపాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కీలకమని, దీనిని బట్టి డిమాండ్ ఉంటుందని ఎస్ అండ్ పీ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి భారత బ్యాంకింగ్ వ్యవస్థ గాడిలోకి వస్తుందని పేర్కొంది. కొవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు బ్యాంకులు ఇప్పటికే చర్యలు చేపట్టాయని వెల్లడించింది. 2021లో భారత ఆర్థిక వ్యవస్థ మైనస్ 7.7 శాతంగా నమోదు కావొచ్చునని తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 10 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది.