భారత ఆర్థిక వ్యవస్థపై 9 నెలల్లో పేలనున్న టైమ్ బాంబ్.. నిర్మలా సీతారామన్ ప్లాన్ ఏంటి..?!
Nirmala Sitharaman: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళుతుండగా, ఆదివార నాడు అమెరికా డాలర్తో రూపాయి మారక విలువ రూ.79.29కి క్షీణించడంతో రూపాయి విలువ రోజురోజుకూ కనిష్ఠాలను చేరుకుంటోంది. రూపాయి విలువ క్షీణించడం వల్ల ధరలు మాత్రమే పెరుగుతాయని భావించే వారికి భారత్లో పేలనున్న టైమ్ బాంబ్ ఏంటో తెలియాలి.
భారత అప్పుల కొండ..
భారత రూపాయి విలువ తగ్గుదల కారణంగా జూన్లో ఇప్పటికే భారీ నష్టాన్ని చవిచూశాం. ఇంతలో, భారత రుణ చెల్లింపులు రాబోయే కొద్ది నెలల్లో పోగుపడుతున్నాయి. ఇది దేశ విదేశీ మారకద్రవ్యాన్ని పెద్దగా ప్రభావితం చేస్తుందని నిపుణుల అంచనాలు చెబుతున్నాయి.
విదేశీ రుణాలు.
.
భారత్ మొత్తం విదేశీ రుణం 621 బిలియన్ డాలర్లుగా ఉంది. విదేశీ మార్కెట్లో తీసుకున్న స్వల్పకాలిక రుణాల కోసం వచ్చే 9 నెలల్లో దాదాపు 267 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. ఇది దేశం మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో దాదాపు 44 శాతం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫారెక్స్ నిల్వలు మన దేశం వద్ద కొన్ని వారాలుగా తగ్గుతూనే ఉన్నాయి. ఇది కొంత మేర ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో దేశీయ కంపెనీలు సైతం విదేశీ మార్కెట్ల నుంచి అప్పులు తీసుకోవటం నిలిపివేశాయి.
పెట్టుబడులు తగ్గుతున్నాయి..
అదే సమయంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం కారణంగా.. అనేక ప్రముఖ కార్పొరేట్లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు భారతీయ మార్కెట్లో తమ పెట్టుబడులను తగ్గించాయి. పైగా స్టార్టప్ కంపెనీలకు నిధుల ప్రవాహం చాలా వరకు తగ్గింది. దీంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి.
ఆర్థిక క్షీణత..
పరిస్థితులు దిగజారితే.. ఆర్థిక వ్యవస్థ పతనం నుంచి ఎవరూ రక్షించలేరు. ఇది మరో 2 సంవత్సరాలు కొనసాగితే.. శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాల మాదిరిగా భారత్ కూడా సంక్షోభంలోకి నెట్టబడవచ్చు. అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడానికి వేచి ఉన్నందున ముడి చమురు ధరలు తగ్గడం భారత మార్కెట్ను కొంత ఊరటనిచ్చి కాపాడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
నిర్మలా సీతారామన్..
ఈ విపత్కర పరిస్థితి నుంచి కోలుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమి చేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఆర్థిక మందగమనాన్ని అధిగమించడంలో గత ప్రభుత్వం మాదిరిగానే మోడీ ప్రభుత్వం కూడా భారీ సవాలును ఎదుర్కొంటోంది. 2008 ఆర్థిక సంక్షోభంలో అతి తక్కువ నష్టపోయిన దేశాల్లో భారత్ ఒకటని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం.
ప్రపంచం దేశాల పరిస్థితి..
బ్రిటన్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. చైనాకు కరోనా ఇన్ఫెక్షన్ తగ్గడం లేదు. రష్యా గురించి చెప్పనవసరం లేదు. పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మాంద్యాన్ని సూచిస్తున్నాయి.
2008 ఆర్థిక సంక్షోభం మళ్లీ వస్తుందా..?
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు 2008 వంటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని అంచనా వేశారు. అదేవిధంగా మాంద్యం మరికొన్ని నెలలు కొనసాగితే 2008 నాటి పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే పరిస్థితులు చేయిదాటకుండా ఉండేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చివరికి సామాన్యులు వీటికి బలికాక తప్పదు.