auto expo: అగ్రస్థానం దిశగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ.. ప్రమాదాల నివారణే ప్రథమ కర్తవ్యం
auto expo: మరో ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలో అగ్రస్థానానికి చేరనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు.
మరిన్ని భద్రతా ప్రమాణాలను జోడించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసే వరకు వేచిచూడకుండా.. స్వచ్ఛందంగా ఆ వైపు ఆలోచించాలని కోరారు. గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన 'ఆటో ఎక్స్పో 2023' ప్రారంభ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. మూడేళ్ల విరామం అనంతరం ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నారు.
నంబర్ వన్ దిశగా..
రెండు రోజులుగా జరుగుతున్న ఎక్స్పోలో.. అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్తగా 75 వాహనాలు లాంచ్ కావడం శుభసూచకమని గడ్కరీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచ నంబర్ వన్గా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2024 చివరి నాటికి దేశంలోని రహదారులు, మౌలిక సదుపాయాలు అమెరికాతో పోటీపడే విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
ఈవీ సెగ్మెంట్కు మరింత ప్రోత్సాహం:
ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ హనీఫ్ ఖురేషీ అంతకు ముందు రోజు వివరించారు. ఇప్పటికే ఈవీల ఉత్పత్రి పెంచేందుకుగాను.. 7, 000 బస్సులకు ప్రోత్సాహకాలు అందించగా.. మరో ఏడాదిలో ఇవి రోడ్లపైకి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.
వాహనాలు 1 శాతమైనా మరణాలు 11 శాతం
2024 చివరి నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని గడ్కరీ ప్రకటించారు. ప్రతిభావంతులైన యువత రోడ్డు ప్రమాదాలలో మరణిస్తుండటం దురదృష్టకరమన్నారు. ఎయిర్ బ్యాగ్స్ వంటి అదనపు భద్రతా పరికాలు అమర్చి వాహనాల ధరలను పెంచినా తమకు అభ్యంతరం లేదని.. ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమన్నారు.
అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సైతం.. రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం ఆటోమొబైల్స్ విభాగంలో భారత్ కేవలం 1 శాతానికే పరిమితమైనా.. రోడ్డు ప్రమాదాల మరణాల్లో మాత్రం 11 శాతం ఉండటం బాధాకరమన్నారు.