భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది, మీకు ఆశ్చర్యం వేయొచ్చు కానీ: నరేంద్ర మోడీ
కరోనా మహమ్మారిపై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై దృష్టి సారించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ కచ్చితంగా తిరిగి పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక రంగాన్ని తిరిగి పట్టాలు ఎక్కించడమే కాకుండా దీర్ఘకాలంలో దేశానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఆయన భారత పరిశ్రమల సమాఖ్య (CII) 125 వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
భారత వృద్ధిపై ఆశ్చర్యం, చైనా బాటలో నడుస్తోందని...
సంస్కరణలు చేపట్టాం..
ప్రభుత్వం వివిధ సంస్కరణలను కొనసాగిస్తోందని, కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి కచ్చితంగా పుంజుకుంటుందని మోడీ చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకున్నదని చెప్పారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై కూడా జాగ్రత్తలు తీసుకుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు మోడీ పిలుపునిచ్చారు. తద్వారా స్వదేశీ వస్తువులు పెరిగి, దిగుమతులు తగ్గేందుకు ఇది దోహదపడుతుంది.
ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతుంది
కరోనా నేపథ్యంలో ఓ వైపు ప్రజల జీవితాలను కాపాడుతూనే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించాల్సిన అవసరం ఉందని మోడీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయాలన్నారు. మన తప్పకుండా మన వృద్ధిని తిరిగి అందుకుంటామని చెప్పారు. రైతులు, చిన్న వ్యాపారాలు, ఎంటర్ప్రెన్యూయర్స్ ఆర్థిక వృద్ధిని తిరిగి పొందుతారని విశ్వాసంతో ఉన్నట్లు చెప్పారు.
ఈ సంస్కరణలు భవిష్యత్తు కోసం
కరోనా మహమ్మారి కారణంగా మన వృద్ధి రేటు వేగం మందగించి ఉండవచ్చునని, ఇప్పుడు లాక్ డౌన్ నుండి అన్ లాక్ దిశగా సాగుతోందని చెప్పారు. అన్లాక్ ఫేజ్ 1లో ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకుందని తెలిపారు. భారత్ తిరిగి వృద్ధిలోకి రావడానికి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల వంటివి చాలా అవసరమని చెప్పారు. తాము చేపడుతున్న సంస్కరణలు యాదృచ్ఛికమో లేక అనాలోచితంగా చేస్తున్నవో కాదని చెప్పారు. పక్కా ప్రణాళికతో, భవిష్యత్తు నిర్మాణం కోసం సంస్కరణలు చేస్తున్నట్లు తెలిపారు.
నా మాటలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు.. కానీ
తమ వరకు సంస్కరణలు అంటే దేశానికి ఉపయోగపడే నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడమని, వీటి ద్వారా ముందుకు సాగుతామని మోడీ చెప్పారు. వృద్ధి తిరిగి సాధిస్తామని, తనను నమ్మాలని, తిరిగి పట్టాలెక్కడం మరీ అంత కష్టమేమీ కాదని చెప్పారు. తిరిగి గతంలోని వృద్ధి సాధిస్తామని తాను ఎంతో నమ్మకంగా ఉన్నానని, ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చునని, కానీ భారత ప్రతిభ, ఆవిష్కరణలు, కృషి, అంకితభావం, శ్రామిక శక్తిపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.