30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, మనవద్దే అదుపులో ధరలు: గోయల్
ప్రస్తుతం మన భారత ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, మున్ముందు కాలంలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తన వాటాను పెంచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ముప్పై ఏళ్ల కాలంలోనే 30 ట్రిలియన్ డాలర్ల(రూ.2340 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందన్నారు.
భారత్ ప్రతి సంవత్సరం ఎనిమిది శాతం వృద్ధిని సాధిస్తే తొమ్మిదేళ్లలో ఆర్థిక వ్యవస్థ స్థాయి రెట్టింపు అవుతుందన్నారు. ఆ లెక్కన రూ.3.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ తొమ్మిదేళ్లలో 6.5 ట్రిలియన్ డాలర్లకు, 18 ఏళ్లలో 13 ట్రిలియన్ డాలర్లకు, 27 ఏళ్లకు 26 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, అప్పుడు 30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థికస్థాయిగా చేరుతుందన్నారు.
కరోనా నుండి కోలుకుంటున్న సమయంలో రష్యా - ఉక్రెయిన్ పిడుగు పడిందని, దీంతో ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని, ద్రవ్యోల్భణం కూడా ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద సానుకూలంగా ఉందన్నారు. పలు ఉత్పత్తుల విషయంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే మన వద్ద ధరలు అదుపులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశ జౌళి రంగం రూ.10 లక్షల కోట్లస్థాయిలో ఉందని, ఎగుమతులు రూ.3.5 లక్షల కోట్ల మేర జరుగుతున్నాయని గోయల్ తెలిపారు. అయిదేళ్లలో పరిశ్రమ రూ.20 లక్షల కోట్లకు, ఎగుమతులు రూ.10 లక్షల కోట్లకు చేరుకునే పరిస్థితి ఉందన్నారు.