ప్యారిస్లో ప్రభుత్వ ఆస్తుల జప్తుపై భారత్ ఏమన్నదంటే...
ఫ్రాన్స్లో ప్రభుత్వ ఆస్తుల జఫ్తు వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ గురువారం స్పందించింది. ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ఫ్రెంచ్ కోర్టు నుండి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేసింది. ప్యారిస్లోని భారత ప్రభుత్వ ఆస్తులను కెయిర్న్ ఎనర్జీ జఫ్తు చేసుకున్నట్లు కొన్ని మీడియాలలో కథనాల వస్తున్నాయని, ఇందుకు సంబంధించి ఫ్రెంచ్ కోర్టు నుండి తమకు ఎలాంటి నోటీసులు, ఉత్తర్వులు లేదా సమాచారం రాలేదని ఆర్థిక శాఖ తెలిపింది.
ఈవార్తల్లోని నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఒకవేళ అలాంటి ఉత్తర్వులు వస్తే అందుకు తగిన విధంగా న్యాయపరమైన చర్యలు చేపడతామని, భారత ప్రయోజనాలను కాపాడుతామని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కెయిర్న్ ఎనర్జీకి సంబంధించి రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో గత ఏడాది ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని ఈ ఏడాది మార్చి 22వ తేదీన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టులో భారత్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపింది. ఈ వివాదం పరిష్కారం కోసం కెయిర్న్ సీఈవో, ప్రతినిధులు కేంద్రంతో చర్చలు జరిపారని గుర్తు చేసింది. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు సిద్ధమని తెలిపింది.
బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ పీఎల్సీ రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో భారత్కు గట్టి షాక్ తగిలినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల ప్రకారం డబ్బులు చెల్లించనందుకు గాను ఫ్రాన్స్లోని భారత ప్రభుత్వ ఆస్తుల జఫ్తుకు అవసరమైన న్యాయప్రక్రియను బుధవారం పూర్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫ్రెంచ్ కోర్టు అనుమతుల మేరకు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్లోని 20 భారత ప్రభుత్వ ఆస్తుల స్వాధీనానికి న్యాయ ప్రక్రియ పూర్తి చేసినట్లుగా చెబుతోంది.