ఎన్నడూ చూడని దారుణపరిస్థితి, కీలక సంస్కరణలు అవసరం: ప్రపంచ బ్యాంకు
ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని నిరోధించేందుకు భారత్ కీలక సంస్కరణలను కొనసాగించాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. కరోనా విధ్వంసంతో దక్షిణాసియా తీవ్ర మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. 2020లో ఈ ప్రాంత వృద్ధి 7.7 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. దక్షిణాసియాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 9.6 శాతం మేర ప్రతికూలత నమోదు చేయవచ్చునని పేర్కొంది. అయితే FY22లో పుంజుకొని 5.4శాతం వృద్ధి నమోదుచేయవచ్చునని అంచనా వేసింది.
ఉద్యోగులకు యాక్సిస్ బ్యాంకు గుడ్న్యూస్, 12% వరకు వేతనాల పెంపు
గతంలో ఎన్నడూ చూడని దారుణ పరిస్థితి
కరోనా మహమ్మారి నియంత్రణలు 2022 నాటికి పూర్తిగా తొలగిపోతాయని వరల్డ్ బ్యాంకు అంచనా వేసింది. ఈ వైరస్ ప్రభావంతో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో భారత ఎగుమతులు, దిగుమతులు దెబ్బతింటాయని తెలిపింది. గతంలో ఎన్నడూ చూడని దారుణ ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు భారత్లో కనిపిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏసియా చీఫ్ ఎకనమిస్ట్ హాన్స్ టిమ్మర్ అన్నారు. ప్రపంచంలోనే అతి సుదీర్ఘ, కఠినమైన లాక్ డౌన్ భారత్లో విధించిన విషయం తెలిసిందే. దీంతో మొదటి క్వార్టర్లో వృద్ధి రేటు ఏకంగా 23.9 శాతం క్షీణించిన విషయం తెలిసిందే.
సంస్కరణలు ప్రయోజనకరం..
2019 నుండి భారత్లో మందగమనం ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంకు దీనిని గుర్తు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సమయంలో కరోనా వచ్చి మరింత దెబ్బతీసిందని పేర్కొంది. అయితే వేగవంతమైన, సమగ్రమైన చర్యలు భారత్లో పేదరికాన్ని తగ్గించడానికి, ఇన్నాళ్ళు కష్టపడిన నిలబెట్టుకున్న వృద్ధిని తిరిగి అందుకోవడానికి సాధ్యం అవుతుందని పేర్కొంది. భారత్ అనేక సంస్కరణలు చేపడుతోందని, ఇది దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనమని పేర్కొంది. పేదరికంపై పోరాడుతున్న దేశానికి ఈ సంస్కరణలు ఉపయోగపడతాయని అభిప్రాయపడింది.
అనధికారిక రంగాల్లో ఎక్కువమంది కార్మికులు
విధానాలు, సంస్థలు, పెట్టుబడుల బలోపేతం కోసం ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతోందని దక్షిణాసియా ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షులు హార్ట్విగ్ షాఫెర అన్నారు. దక్షిణాసియాలో మూడొంతుల మంది కార్మికులు అనధికారిక రంగాల్లో ఉన్నారని పేర్కొంది. పెరుగుదున్న ఆహార ధరలతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరోనా అనధికారిక రంగంలోని కార్మికులపై మరింత ప్రభావం చూపిందని ఆందోళన వ్యక్తం చేసింది.