భారత్ కోలుకోవాలంటే ఐదేళ్లు తప్పనిసరి- పదేళ్లలో మూడో స్ధానం- తాజా అంచనాలు
కరోనా కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటైన భారత్ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఓవైపు పడిపోతున్న జీడీపీ, స్టాక్ మార్కెట్ల పతనం, వ్యాపారాలపై ప్రభావం.. ఇలా ఒకటేమిటి పలు అంశాలు భారత్ను దెబ్బతీశాయి. కరోనా కారణంగా ప్రపంచంలో ఐదో అది పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న భారత్ కాస్తా ఆరోస్ధానానికి దిగజారింది. అయితే లాక్డౌన్ ఎత్తేశాక కాస్త సానుకూల వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇది మునుపటి స్ధాయికి తీసుకెళ్తుందా లేదా అన్న చర్చ మాత్రం సాగుతూనే ఉంది. తాజా అంచనాల ప్రకారం భారత్ తిరిగి ఐదో స్ధానానికి చేరుకోవాలంటే ఐదేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు.
భారత ఆర్ధిక వ్యవస్ధపై కరోనా దెబ్బ
ఈ ఏడాది కరోనా రాకముందే పడుతూ లేస్తూ ఉన్న భారత ఆర్ధిక వ్యవస్ధపై కరోనా ప్రభావం పిడుగుపాటులా మారింది. వైరస్ దెబ్బకు భారత ఆర్ధిక వ్యవస్ధ ప్రపంచవ్యాప్తంగా ఐదో స్ధానం నుంచి ఆరో స్ధానానికి దిగజారింది. అప్పటివరకూ ఆరో స్ధానంలో ఉన్న బ్రిటన్ మనల్ని వెనక్కి నెట్టి ఐదో స్ధానానికి ఎగబాకింది. వాస్తవానికి గతేడాది ఆరో స్ధానం నుంచి బ్రిటన్ ను వెనక్కి నెట్టి ఐదో స్ధానానికి చేరిన భారత్... కరోనా సమయంలో తిరిగి ఆరో స్ధానానికి చేరింది. దీంతో తిరిగి ఐదో స్ధానం ఎప్పుడు దక్కించుకుంటుందన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు సర్వేసంస్ధలు, నిపుణులు ఈ అంచనాల్లోనే మునిగితేలుతున్నారు.
2025 కల్లా ఐదో స్ధానానికి భారత్
ప్రస్తుతం ఉన్న ఆరో స్ధానం నుంచి భారత్ తిరిగి తన ఐదో స్ధానానికి రావాలంటే 2025 వరకూ ఆగాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) నిర్వహించిన అధ్యయనంలో భారత్ తిరిగి ఐదో స్ధానానికి రావాలంటే ఐదేళ్ల పాటు శ్రమించక తప్పదని తేల్చింది. ప్రస్తుతం భారత్, బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధలు, ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్ధితుల ఆధారంగా చూస్తే 2024 వరకూ బ్రిటన్ స్ధానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని అంచనా వేసింది. రూపాయి బలహీనం కావడం వల్లే ఈ ఏడాది బ్రిటన్ భారత్ స్ధానాన్ని ఆక్రమించిందని సీఈబీఆర్ తన వార్షిక నివేదికలో తెలిపింది.
2030 కల్లా మూడో స్ధానానికి...
ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులు చూస్తుంటే 2021లో భారత ఆర్ధిక వ్యవస్ధ తన పరిధిని 9 శాతం పెంచుకుంటుందని, 2022లో మరో 7 శాతం పెంచుకుంటుందని సీఈబీఆర్ రిపోర్ట్ తెలిపింది. 2035 నాటికి భారత్ జీడీపీ 5.8 శాతానికి పరిమితం అవుతుందని వెల్లడించింది. దీని వల్ల భారత్ 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించడం ఖాయమని సీఈబీఆర్ అంచనా వేస్తోంది. 2025లో బ్రిటన్ను దాటిన తర్వాత 2027లోనే జర్మనీని, 2030లో జపాన్ ఆర్ధిక వ్యవస్ధను కూడా భారత్ దాటేసి మూడో స్ధానం అందుకుటుందని ఈ నివేదిక అంచనా వేస్తోంది.
ఆర్ధిక మందగమనమే అసలు సమస్య
జాతీయ వృద్ధి రేటు అనుకున్నంత వేగంగా లేకపోవడానికి ప్రధాన కారణాలను కూడా ఈ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్ధలో నెలకొన్న సంక్షోభం, సంస్కరణలకు సిద్ధం కాకపోవడం, ప్రపంచ వాణిజ్యం క్షీణించడం వృద్ధి రేటు మందగమనానికి ముఖ్య కారణాలుగా పేర్కొంది. వీటన్నింటికంటే మించి ఈ ఏడాది ఎదురైన కరోనా సంక్షోభం భారత్ను దారుణంగా దెబ్బతీసినట్లు నివేదిక పునరుద్ఘాటించింది. కరోనా కారణంగా దేశంలో డిసెంబర్ నాటికి లక్షా 40 వేల మంది చనిపోవడాన్ని కూడా ప్రస్తావించింది. అమెరికా తర్వాత భారత్ ఈ విషయంలో రెండో స్ధానంలో ఉందని తెలిపింది.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోంది.. రెండో త్రైమాసికం ప్రశ్నార్థకమే!