మీరు రిస్క్ చేయండి, భారత్కు ఏం అవసరమో చూడాలి: ఇండస్ట్రీతో నిర్మల
కరోనా సమయంలోను భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగే, భారత పారిశ్రామికవేత్తలకు కూడా రిస్క్ చేయాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, కార్పోరేట్ పరిశ్రమ రిస్క్ తీసుకోవాలన్నారు.
బుధవారం CII గ్లోబల్ సమ్మిట్ 2021లో నిర్మల మాట్లాడారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కంపెనీలు ఉత్పాదక సామర్థ్యాలను విస్తరించాలని కార్పోరేట్ కంపెనీలను కోరారు. వినూత్న అవకాశాలు ఉన్నాయని, కనిపిస్తున్నాయని, అలాంటి టెక్నాలజీని అందించే భాగస్వాములను అన్వేషించడంలో జాప్యం చేయవద్దన్నారు. దేశంలో తయారీ కోసం విడిభాగాలను దిగుమతి చేసుకుంటే సమస్య లేదన్నారు. తుది ఉత్పత్తుల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక అంతరాలు తగ్గేలా
భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి లైన్లోకి తీసుకు రావడం ప్రభుత్వం ముందు ఉన్న తక్షణ కర్తవ్యం, ఆ దిశగా పని చేస్తోందని నిర్మలమ్మ అన్నారు. 'భారత కంపెనీలు మరింత రిస్క్ తీసుకోవాలి. భారత్కు ఏది అవసరమో దానిని అందిపుచ్చుకోవాలి' అని సూచించారు. భారత పరిశ్రమ మరింత ముందుకు సాగాలని, వేగంగా విస్తరించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఆర్థిక అంతరాలను తగ్గించేందుకు వీలుగా మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని పరిశ్రమ వర్గాలను కోరారు.
డిమాండ్ పుంజుకుంది
దీపావళి పండుగ సమయంలో డిమాండ్ భారీగా పెరిగిందని నిర్మలమ్మ అన్నారు. ఇది రివేంజ్ షాపింగ్ అని చెప్పవచ్చునని, డిమాండ్, అమ్మకం పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. డబ్బు తిరిగి తమ జేబుల్లోకి వస్తోందని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. సెమీ కండక్టర్స్, కంటైనర్ కొరత లేకుంటే ఆటో రంగంలోను రికార్డ్ సేల్స్ నమోదు చేసి ఉండేదని చెప్పారు. స్పెండింగ్స్ ఈ ఏడాది దాదాపు 34 శాతం పెరిగాయని చెప్పారు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్స్ 134 శాతం పెరిగినట్లు తెలిపారు. స్కిల్ వ్యాల్యూస్ పెరుగుతున్నట్లు తెలిపారు.
ముడి చమురు ధరలు తగ్గగకపోవచ్చు
దేశీయంగా వస్తు తయారీ కోసం విడిభాగాలను దిగుమతి చేసుకోవడం సమస్య కాదని చెప్పారు. కస్టమర్లకు విక్రయించే ఉత్పత్తుల దిగుమతులను మాత్రం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వృద్ధికి ప్రేరణ కోసం చూస్తోందని, ఈ సమయంలో పరిశ్రమ వర్గాలు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండటంతో పాటు దేశం ఏం కోరుకుంటుందో అర్థం చేసుకోవాలన్నారు. పారిశ్రామికాభివృద్ధి అవరోధాలను తొలగించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. బ్యాంకింగ్ రంగం వేగంగా కోలుకుంటోందన్నారు.
రికవరీ పెరగడంతో మొండిబకాయిలు తగ్గుముఖం పడుతున్నాయని, PSB మార్కెట్ నుండి రూ.10,000 కోట్లు సమీకరించినట్లు చెప్పారు. నిధుల కోసం ప్రభుత్వం వైపు చూడటం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయని, ఇది మన వద్ద ధరలు పెరగడానికి కారణమైనట్లు తెలిపారు. ముడిచమురు ధరలు మళ్లీ తగ్గుతాయన్న సంకేతాలు లేవన్నారు.
ఎల్ఐసీ ఐపీవో ఈ మార్చిలోపే ఉండవచ్చునని చెబుతున్నారు.