రానున్న ఐదేళ్లలో సౌర మరియు పవన విద్యుత్ రంగాలకు నష్టం తప్పదు: రిపోర్ట్
రానున్న ఐదేళ్లలో భారత సౌరశక్తి మరియు పవన విద్యుత్ పునరుత్పాదక సామర్థ్యం వరుసగా 35 గిగావాట్లు, 12 గిగావాట్లు మాత్రమే ఉంటుందని ఓ నివేదిక వెల్లడించింది. దీనికి కారణం కోవిడ్-19 అని వెల్లడించింది. 2020-24వరకు వేసిన అంచనా ప్రకారం సౌర విద్యుత్ శక్తి 43 గిగావాట్లుగా ఉండగా పవన విద్యుత్ శక్తి 15 గిగావాట్లుగా అంచనా వేసినట్లు క్లీన్ ఎనర్జీ కన్సల్టెన్సీ బ్రిడ్జ్ టూ ఇండియా పేర్కొంది.
నష్టాల్లో సౌర మరియు పవన విద్యుత్ రంగాలు
భారత్లో పెరిగిపోతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోవాల్సి ఉన్నందున ఆ ప్రభావం సౌర మరియు పవన విద్యుత్ రంగాలపై ఉందని నివేదిక వెల్లడించింది. డిమాండ్ మరియు సప్లయ్కు కరోనా కారణంగా పెద్ద అడ్డంకులే ఎదురయ్యాయని నివేదిక పేర్కొంది. అయితే ఈ ప్రభావం మరీ అంతా తీవ్రంగా లేదని ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటనలు చేయడమే అని వెల్లడించింది నివేదిక. రానున్న కొన్నేళ్లలో పునరుత్పాదక విద్యుత్కు డిమాండ్ ఉండదని నివేదిక జోస్యం చెప్పింది. అదే సమయంలో డిస్కమ్ ఆర్థిక స్థితిగతులు కూడా క్షీణించడంతో వాటికి ఆర్థిక రుణాలు ఇవ్వడంలో అవరోధాలు ఎదురవుతాయని నివేదిక వివరించింది.
అదనంగా 2 నుంచి 3 గిగా వాట్లు నష్టం
ఇక విద్యుత్ పునరుత్పాదక రంగంలో మహమ్మారి ప్రభావం ఉండటం, వర్క్ క్యాపిటల్ పెరిగిపోవడం, కాంట్రాక్టర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో 2020 నాటికి అదనంగా 2 నుంచి 3 గిగా వాట్లు సామర్థ్యం మేరా నష్టపోతుందని నివేదిక పేర్కొంది.అంతేకాదు సౌర విద్యుత్కు డిమాండ్ తగ్గడం, డిస్కమ్లు రిస్క్ తీసుకోలేకపోవడం, రుణాలు అందకపోవడం, విధానాల్లో అనిశ్చితి నెలకొనడం వల్ల సామర్థ్యం తక్కువగా ఉంటుందని వివరించిన నివేదిక... స్థానికంగా తయారీదారులకు ఇది మేలు చేకూరుస్తుందని పేర్కొంది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలా ఉందంటే..
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలల వరకు 715 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం జరిగిందని గత నెలలో నివేదిక స్పష్టం చేసింది. గతేడాది ఇదే సమయానికి 2163 మెగా వాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసింది. అంటే ఈ ఏడాది ఇది 67శాతంకు పడిపోయింది. పవన విద్యుత్ ద్వారా 28 మెగావాట్లు మాత్రమే మార్చి త్రైమాసికానికి ఉత్పత్తి అయినట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి పవన విద్యుత్ ద్వారా 944 మెగా వాట్లు జనరేట్ అయ్యిందని వెల్లడించింది. అయితే ఈ సారి మాత్రం కరోనా వైరస్ కారణంగా రెండు మరియు మూడో త్రైమాసికాలకు గాను సౌర మరియు పవన విద్యుత్ రంగాలు మరింత నష్టపోతాయని జోస్యం చెప్పింది.