పామాయిల్ కృత్రిమ కొరతా?: భారీగా తగ్గిన దిగుమతులు
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణంలో పైపైకి దూసుకెళ్తూనే ఉంది. రిటైల్తో పాటు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ భారీగా పెరిగింది. ఏప్రిల్ హోల్సేల్ ద్రవ్యోల్బణంతో పోల్చుకుని చూస్తే.. మే నెలలో ఇది మరింత పైకి ఎగబాకింది.
డబ్ల్యూపీఐ పెరుగుదలకు
ఏప్రిల్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) 15.8 శాతంగా నమోదు కాగా.. మే నాటికి భారీగా పెరిగింది. 15.88 శాతానికి చేరింది. గత సంవత్సరం అంటే 2021 మే నెలతో పోల్చుకున్నా కూడా ఈ సంఖ్య ఎక్కువే. గత ఏడాది మే నెలలో నమోదైన డబ్ల్యూపీఐ 13.11 శాతమే. సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి పైకెళ్లి కూర్చుంది. 15.88 శాతంగా నమోదైంది.
వంటనూనెలు, నిత్యావసర సరుకుల ధరల్లో..
ఇప్పుడు తాజాగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా అదే దారిలో నడుస్తోంది. కొన్ని నెలలుగా వంటనూనెలు, పప్పు దినుసులు.. ఇతర నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. వంటనూనెల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న సందర్భాలు లేకపోలేదు.
అన్నింటి రేట్లూ..
ఏది ముట్టుకున్నా షాక్ కొట్టేంత స్థాయికి ధరలు చేరుకున్నాయి. టమోటా ఇతర కూరగాయల రేట్లు సైతం అదే స్థాయిలో ఉంటోన్నాయి. ఏప్రిల్లో వ్యవసాయం, గ్రామీణ కార్మిక రంగాల్లో ద్రవ్యోల్బణం 6.44, 6.67 శాతం మేర పెరిగింది. ఇదివరకు వ్యవసాయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09, గ్రామీణ కార్మిక రంగంలో 6.33 ఉండేది.
33 శాతం తగ్గుదల..
ఈ పరిణామాల మధ్య మే నెలలో పామాయిల్ దిగుమతులు భారీగా తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఆ ఒక్క నెలలోనే 33 శాతం మేర పామాయిల్ దిగుమతులు తగ్గాయి. మే నెలలో 5,14,022 టన్నుల మేర పామాయిల్ దిగుమతులు తగ్గినట్లు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.
లెక్కలివీ..
గత సంవత్సరం మే నెలలో భారత్ దిగుమతి చేసుకున్న పామాయిల్.. 7,69,602 టన్నులు. ఈ ఏడాది అదే మే నెలలో ఏకంగా 5,14,022 టన్నుల మేర తగ్గింది. 4.09,000 టన్నుల మేర పామాయిల్ ఉత్పత్తులు, ముడి పామాయిల్ను భారత్ దిగుమతి చేసుకుంది. రిఫైన్డ్ బ్లీచ్డ్ డియోడరైజ్డ్ (ఆర్బీడీ) పామాయిల్ దిగుమతులు స్వల్పంగా పెరిగాయి.
ఇండోనేషియా నిషేధం ఎత్తేసినా..
పామాయిల్ దిగుమతులు ఇంత భారీ పరిమాణంలో తగ్గడానికి కారణలేమిటనే విషయంలో మార్కెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. వంటనూనెను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటోంది. ఇండొనేషియా పామాయిల్ దిగుమతులపై నిషేధాన్ని ఎత్తేయడం, నిబంధనలను సడలించిన తరువాత కూడా వాటి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి.
సోయాబీన్, సన్ఫ్లవర్
సోయాబీన్ దిగుమతులు కూడా స్వల్పంగా పెరిగాయి. 2.67 లక్షల టన్నుల నుంచి 3.73 లక్షల టన్నుల వరకు పెరిగాయి. సన్ఫ్లవర్ వంటనూనెల్లోనూ ఇదే రకమైన పెరుగుదల కనిపించింది. 1.18 లక్షల టన్నుల నుంచి 1.75 లక్షల టన్నుల వరకు ఇందులో పెరుగుదల చోటు చేసుకుంది.