Covid-19: సాఫ్టువేర్ సహా ఈ రంగాల్లో ఉద్యోగాలు ఓకే, బ్రిటన్ కంటే బెస్ట్.. అమెరికా కంటే వరస్ట్
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోత, వేతనాల కోత వంటివి చోటు చేసుకున్నాయి. కరోనా-లాక్ డౌన్ కారణంగా ఇళ్లకు పరిమితమయ్యారు. షట్ డౌన్ ముగిసినప్పటికీ సామాజిక దూరం వంటివి పాటించడం, బయటకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించక పోవడంతో ఆన్లైన్ బిజినెస్ డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకోనున్నాయి. ఇందులో పర్మినెంట్, టెంపరరీ ఉండనున్నాయి. ఇప్పటికే అమెజాన్ 20,000 తాత్కాలిక ఉద్యోగాలను ప్రకటించింది. ఇతర రంగాల్లోను ఉద్యోగాల కోత లేదా శాలరీ కోత ఉన్నప్పటికీ ఇతర ఎన్నో ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగ్గా ఉందని ఓ సర్వే తెలిపింది.
ప్లీజ్.. చైనా కంపెనీవి చూపించొద్దు: రిటైలర్స్కు షాక్, ఆ దెబ్బతో 'మేడిన్ ఇండియా లోగో'
ఇతర దేశాల కంటే ఇండియా బెట్టర్
కరోనా నేపథ్యంలో ఇతర దేశాల కంటే భారత్ పరిస్థితి ఉద్యోగాలు, వేతనాల కోత విషయంలో మెరుగ్గా ఉన్నట్లు గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులపై వేటు వేయడం, నియామకాలను నిలిపివేస్తున్నాయని, భారత్లోను ఉందని, అయినప్పటికీ హైరింగ్ ప్రక్రియ పెద్దగా దెబ్బతినలేదని ఈ నివేదిక తెలిపింది. మార్చి రెండో వారం వరకు నియామకాలు గత ఏడాది తరహాలోనే సాగాయని, మార్చి ద్వితీయార్ధం నుంచి ఏప్రిల్, మే వరకు లాక్ డౌన్ ప్రభావంతో మందగించాయని తెలిపింది.
యూకే కంటే బెస్ట్, అమెరికా కంటే వరస్ట్
ఇక, జూన్ నెల మిడిల్ వరకు చూస్తే ఇండియాలో జాబ్ పోస్టింగ్స్ 2019తో పోలిస్తే 51 శాతం మేర తగ్గినట్లు తెలిపింది. అయితే గ్లోబల్ మార్కెట్లో ఇంతకంటే ఎక్కువగా ఉందని వెల్లడించింది. యూకేలో 60 శాతం, మెక్సికోలో 61 శాతం, యూరోప్ కంట్రీస్లో కూడా ఇలాగే ఉందని తెలిపింది. అయితే అమెరికా (29 శాతం), సింగపూర్ (32 శాతం), ఆస్ట్రేలియా (42 శాతం) కంటే మాత్రం భారత్ వెనుకబడిందని తెలిపింది. ఈ నివేదిక కరోనా వ్యాప్తి ప్రారంభమైన ఫిబ్రవరి నుండి కరోనా వల్ల ప్రపంచం అస్తవ్యస్తమైన మే నెల వరకు ఉన్న లెక్కల ఆధారంగా నివేదిక సిద్ధం చేసింది.
ఈ రంగాల్లో ఉద్యోగాలు పెరిగాయి
కరోనా నేపథ్యంలో ఐటీ, వైద్య సేవలు, మార్కెటింగ్ రంగాల్లో హైరింగ్స్ ఊపందుకున్నట్లు ఈ నివేదిక తెలిపింది. అలాగే డెలివరీ, ఐటీ మేనేజర్లు వంటి నియామకాలు ఒకింత ప్రోత్సాహకరంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే కొన్ని రంగాలు మాత్రం దారుణమైన పతనాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపింది. కొన్ని అయితే ఆర్థిక కార్యకలాపాలు మూసివేసే దిశకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ రంగాలు భారీగా దెబ్బతిన్నాయి
దెబ్బతిన్న రంగాల్లో గత ఏడాదితో పోలిస్తే నియామకాలు 78 శాతం తగ్గాయని తెలిపింది. ఆహార తయారీ రంగంలో 78 శాతం, టూరిజం, ఆతిథ్య రంగాల్లో 77 శాతం, శానిటేషన్ రంగంలో 74 శాతం మేర జాబ్ లిస్టింగ్స్ తగ్గినట్లు నివేదిక తెలిపింది. కరోనా నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు, కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్కు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి-మే మధ్య రిమోట్ వర్క్ 380 శాతం పెరిగింది.