ప్రపంచబ్యాంక్ అధినేతతో నిర్మలమ్మ భేటీ: కీలక అంశాలపై..!
వాషింగ్టన్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉంటోన్నారు. తీరిక లేని షెడ్యూల్లో గడుపుతున్నారు. ఇప్పటికే ఆమె వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమెరికాకు చెందిన అగ్రస్థాయి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులను కలిశారు. భారత్లో పెట్టుబడులను పెట్టాలంటూ వారిని ఆహ్వానించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యల గురించి వారికి వివరించారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సభ్యులనూ కలుసుకున్నారు.
తాజాగా ప్రపంచబ్యాంక్ అధినేత డేవిడ్ మల్పాస్తో సమావేశం అయ్యారు నిర్మల సీతారామన్. వాషింగ్టన్ డీసీలోని ప్రపంచబ్యాంక్ కార్యాలయంలో డేవిడ్ మల్పాస్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె వరల్డ్ బ్యాంక్ చీఫ్ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్లో కరోనా వైరస్ తరువాతి పరిస్థితులను నిర్మల సీతారామన్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వాతావరణం మార్పులు, కరోనా వైరస్ను నిర్మూలించడానికి అనుసరిస్తోన్న వ్యూహాల గురించి మాట్లాడారు. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్ను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం వల్ల ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులపై చర్చించారు. ఆర్థిక లోటును అధిగమించడానికి చేపట్టిన చర్యల గురించి కూడా వారిద్దరి మధ్య చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. భారత్కు మరింత ఉదారంగా సహాయం చేయాలని, రుణ పరిమితిని పెంచాలంటూ నిర్మల సీతారామన్ విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ తరువాతి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రపంచబ్యాంకు తీసుకున్న చర్యల పట్ల నిర్మల సీతారామన్ ప్రశంసించారు. భారత్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహకరించిందని వ్యాఖ్యానించారు. క్లైమెట్ ఛేంజ్ గురించి మాట్లాడుతూ కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి ప్రపంచస్థాయిలో పరిశోధనలకు మరింత ప్రోత్సహం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మౌలిక రంగంలో మరిన్ని సంస్కరణలను చేపట్టాల్సి ఉందని, ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.