భారత విదేశీ అప్పులు 2.1 శాతం పెరిగి 570 బిలియన్ డాలర్లు
ఇండియా ఎక్స్టర్నల్ డెబిట్స్ మార్చి 2021 నాటికి ఏడాది ప్రాతిపదికన 2.1 శాతం పెరిగి 570 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలోను భారత విదేశీ అప్పులు నిలకడగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. భారత విదేశీ అప్పు ప్రభుత్వ, ప్రయివేటు రంగాలకు కలిపి FY21 చివరి నాటికి 570 బిలియన్ డాలర్లు (రూ.42.33 లక్షల కోట్ల) చేరాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఉన్న 558.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2.1 శాతం ఇది అధికమని తెలిపింది. జీడీపీలో దీని వాటా 21.1 శాతంగా ఉంది. డెబిట్ సర్వీస్ రేషియో 8.2 శాతంగా ఉంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ టు ఎక్స్టర్నల్ డెబిట్ రేషియే 101.2 శాతంగా నమోదయింది. గత ఏడాది కంటే ఇది 15.6 శాతం అధికం. ఇవి కంఫోర్ట్ జోన్లో ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కోవిడ్ 19 రుణాలు, ఎన్నారై డిపాజిట్స్తో పాటు యూఎస్ డాలర్ కాంట్రిబ్యూషన్ కారణంగా ఫారెన్ డెట్ లెవల్స్ మార్చి చివరి నాటికి పెరిగినట్లు తెలిపారు. ఈ మేరకు ఇండియాస్ ఎక్స్టర్నల్ డెబిట్స్: ఏ స్టేటస్ రిపోర్ట్ 2020-21లో పేర్కొన్నారు. 2020 మార్చి నాటికి విదేశీ డెబిట్స్ వాటా జీడీపీలో 20.6 శాతంగా ఉంది. ఈ మొత్తంలో దీర్ఘకాల రుణం 82.3 శాతంగా ఉండగా, స్వల్పకాల రుణం 17.7 శాతంగా ఉంది. రూపాయి విలువ క్షీణించడం వల్ల 6.8 బిలియన్ డాలర్ల మేర రుణం పెరిగినట్లు తెలిపారు. ఈ నష్టాన్ని మినహాయిస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిన నికర విదేశీ డెబిట్స్ 11.5 బిలియన్ డాలర్లకు బదులు 4.7 బిలియన్ డాలర్లకు పరిమితమవుతుంది.
మొత్తం రుణాల్లో సార్వభౌమ విదేశీ రుణం 107.2 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది కంటే ఇది 6.2 శాతం మేర పెరిగింది. FY20లో 6.6 శాతం మేర విదేశీ డెబిట్స్ తిరిగి చెల్లించగా, FY21లో 8.2 శాతం మేర చెల్లించారు. విదేశీ డెబిట్స్ పరంగా భారత్ ప్రపంచంలో 24వ స్థానంలో ఉంది. మిగతా కనీస మధ్యతరహా ఆదాయం గల దేశాలతో పోలిస్తే భారత విదేశీ డెబిట్స్ సుస్థిరంగానే ఉంది. మొత్తం అప్పులో 18.8 శాతం ప్రభుత్వ రుణం, 81.2 శాతం ఇతర రుణాలు. ఆర్థిక రంగం 204.6 బిలియన్ డాలర్లు, నాన్ ఫైనాన్షియల్ ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన 33 బిలియన్ డాలర్లు, నాన్ ఫైనాన్షియల్ ప్రయివేటు సంస్థలవి 124.3 బిలియన్ డాలర్లు, స్వల్పకాలిక రుణాలు 101.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.