2023 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ వృద్ధి 23 శాతం, ఈ కారణంతో డిమాండ్
FY2021-23 ఆర్థిక సంవత్సరం మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ వృద్ధి 26 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. చమురు వినియోగం లేకపోవడంతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి తీసుకున్న చర్యలు డిమాండ్కు ఊతమిచ్చేలా ఉన్నాయ. ఈ నేపథ్యంలో రానున్న రెండేళ్లలో వీటి వృద్ధి భారీగా ఉంటుందని అంచనా వేస్తోంది.
అయితే కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక భారంతో పాటు స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పరిమితంగా ఉండటం సేల్స్ పైన ప్రభావం చూపుతుందని అంటోంది. స్థానిక ఉత్పత్తి, కరోనావల్ల కలిగిన ఆర్థిక భారం ముందున్న సవాళ్లు అని తెలిపింది. కేంద్ర బడ్జెట్లో ఈవీ పైన ప్రత్యేక దృష్టి సారించారని, ఇది మున్ముందు ఎంతో ప్రయోజనకరమని తెలిపింది.
పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచడం, ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుండి 5 శాతానికి తగ్గించడం సేల్స్ పెరగడానికి దోహదపడతాయని పేర్కొంది. మొత్తానికి ఆసియా ప్రాంతంలో ఈవి మార్కెట్ క్రమంగా పెరుగుతోందని తెలిపింది.