రూ.52 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం, భారత్ ఆర్థిక నష్టం తీరేందుకు 12 ఏళ్లు
భారత్ ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి నుండి బయటపడేందుకు మరో పుష్కర కాలం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నివేదిక వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో రూ.52 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం ఏర్పడిందని, ప్రపంచ దేశాలతో పాటు మన దేశం ఎంతగానో నష్టపోయిందని పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ నివేదికను ఆర్బీఐ రూపొందించింది.
భారీ క్షీణత
కరోనా మహమ్మారి వరుసగా రావడం ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని, త్రైమాసిక జీడీపీలో ఈ ప్రభావం కనిపించిందని పేర్కొంది. 2020-21 తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ భారీ క్షీణతను నమోదు చేసిందని, క్రమంగా కోలుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపిందని, మళ్లీ కోలుకుంటున్న సమయంలో 2022 జనవరిలో కరోనా మూడో దశ ప్రభావం చూపిందని తెలిపింది. అయితే కరోనా ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్, సెకండ్ వేవ్తో పోలిస్తే మూడో వేవ్ చాలా తక్కువ ప్రభావం చూపిందని పేర్కొంది.
రష్యా-ఉక్రెయిన్ ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా అంతర్జాతీయ, దేశీయ వృద్ధి తగ్గిపోతోందని తెలిపింది. కమోడిటీ ధరలు పెరగడం, అంతర్జాతీయ సప్లై చైన్లో అంతరాయాలు ఇందుకు కారణమని తెలిపింది. కరోనా ముందు వృద్ధి రేటు ధోరణి గమనిస్తే 6.6 శాతం నమోదయిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న ఆర్థిక సంవత్సరాలు మినహాయిస్తే అది 7.1 శాతం సీఏజీఆర్ నమోదు చేసిందని ఆర్బీఐ తెలిపింది.
భారీ నష్టం
వివిధ ఆర్థిక సంవత్సరాల్లో భారీగా ఉత్పత్తి నష్టం జరిగిందని తెలిపింది. కరోనా కారణంగా 2020-21లో రూ.19.1 లక్షల కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.17.1 లక్షల కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.16.4 లక్షల కోట్ల ఉత్పత్తి తగ్గుతోందని తెలిపింది. 2020-21లో ఆర్థిక వ్యవస్థ 6.6 శాతం క్షీణించగా, 2021-22లో వృద్ధి రేటు 8.9 శాతంగా నమోదయిందని, 2022-23లో 7.2 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 2034-35 నాటికి కరోనా కరోనా నష్టాలను ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధిగమించే అవకాశం ఉందని నివేదికలో తెలిపింది.