111 బిలియన్ డాలర్లకు చేరనున్న ఈ-కామర్స్ వ్యాపారం
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది ఈ-కామర్స్ వ్యాపారం భారీగా పెరిగింది. ఈ వైరస్ కారణంగా చాలామంది వ్యాపారులు, అలాగే కొనుగోలుదారులు ఆన్ లైన్ వైపు మరలుతున్నారు. దీంతో ఈ-కామర్స్ మార్కెట్ ఎగిసిపడింది. 2024 వరకు ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్ 84 శాతం ఎగిసి 111 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ FIS అంచనా వేసింది. FIS కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మర్చంట్స్, బ్యాంకులు, క్యాపిటల్ మార్కెట్ కంపెనీలకు టెక్ సొల్యూషన్స్ అందిస్తుంది.
2020లో 60 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ-కామర్స్ వ్యాపారం వచ్చే నాలుగేళ్లలో 111 బిలియన్ డాలర్లకు చేరనుందని తెలిపింది. దాదాపు 41 దేశాల్లో ప్రస్తుత, భవిష్యత్ చెల్లింపుల ధోరణులను FIS నివేదికలో విశ్లేషించారు. కరోనా, తదనంతర పరిణామాలతో భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారుల ధోరణుల్లో మార్పులు వచ్చాయి.
చెల్లింపుల కోసం కొత్త విధానాలను ఉపయోగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో భారత్లో ఈ-కామర్స్ విభాగం భారీగా పెరిగింది. భవిష్యత్తులో మరింతగా వృద్ధి చెందే అవకాశముందని FIS వరల్డ్ పే ఎండీ (ఆసియా పసిఫిక్) తెలిపారు. మొబైల్ షాపింగ్ వచ్చే నాలుగేళ్లలో 21 శాతం మేర వృద్ధి సాధించవచ్చునని పేర్కొంది.
2020లో ఎక్కువగా వినియోగించిన చెల్లింపు విధానాల్లో డిజిటల్ వ్యాలెట్లు 40 శాతం, క్రెడిట్, డెబిట్ కార్డులు 15 శాతం చొప్పున ఉన్నాయి. ఆన్ లైన్ చెల్లింపు మార్కెట్లో డిజిటల్ వ్యాలెట్ల వాటా వచ్చే నాలుగేళ్లలో 47 శాతానికి పెరగవచ్చునని పేర్కొంది. అలాగే ముందు కొనుగోలు చేసి, తర్వాత చెల్లింపులు జరిపే విధానం పెరగనుందని తెలిపింది.