మూడు నెలల్లో 22 ఐపీవోలు, ప్రపంచంలోనే భారత్ 9వ స్థానంలో
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి)లో ఐపీవోలు సందడి చేశాయి. ఏకంగా 22 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి. వీటి వ్యాల్యూ దాదాపు రూ.19,000 కోట్లు లేదా 2.5 బిలియన్ డాలర్లకు పైన. 2021 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోలను చూస్తే సంఖ్యాపరంగా ప్రపంచంలో భారత్ 9వ స్థానంలో ఉంది. ఈ మేరకు బుధవారం విడుదలైన ఈవై ఇండియా ఐపీవో నివేదిక ప్రకారం కన్స్యూమర్ ప్రోడక్ట్స్, రిటైల్, బహుళార్ధ పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమోటివ్, ట్రాన్సుపోర్టేషన్ రంగాలకు చెందిన సంస్థలు స్టాక్ మార్కెట్లోకి అధికంగా వచ్చాయి.
ఐదు చిన్న, మధ్యతరహా సంస్థ(SME)లు కూడా పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. వీటిలో భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్ప్ ఐపీవో అతిపెద్దది. ఈ ఇష్యూ వ్యాల్యూ రూ.4,740 కోట్లు. ఈ ఏప్రిల్-జూన్ కాలంలోను ఐపీవోలు భారీగానే వస్తాయనే అంచనాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రధాన మార్కెట్లో 17 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాగా, 2020 క్యాలెండర్ ఏడాది తొలి త్రైమాసికంలో ఒక కంపెనీ మాత్రమే ఐపీవోకు వచ్చింది. 2020 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పది కంపెనీలు ఆఫరింగ్కు వచ్చాయి. మరో 20 కంపెనీలు ఐపీవోకు వచ్చే అవకాశముంది. మరో 30 కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన ప్రయివేటు ఈక్విటీ ఇన్వెస్టర్లు వాటాలను ఉపసంహరించుకునే యోచనలో ఉన్నారు.