రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, నోట్ల రద్దు, ద్రవ్యోల్భణంపై రాజన్ ఏమన్నారంటే?
దేశంలో పెరుగుతున్న ధరల ఒత్తిడికి అనుగుణంగా భారత్ పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఆయన ఓ ఆంగ్ల ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్ వ్యక్తి సామర్థ్యాలను నిర్మించే అంశంపై దృష్టి సారించాలన్నారు. అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని ఆయన విశ్లేషించారు. మెడికల్ డిగ్రీ కోసం విద్యార్థులు భారత్ నుండి ఉక్రెయిన్ సహా విదేశాలకు వెళ్లవలసిన అవసరం ఏముందని కూడా రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై స్పందించారు.
పెద్ద నోట్ల రద్దు
ఆరేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు వ్యవహారం దేశ ఆర్థికాభివృద్ధికి ఇబ్బందికరంగా మారిందని రఘురాం రాజన్ పరోక్షంగా అన్నారు. భారత్ వృద్ధిపై ఆందోళన చెందుతున్నారా అని ప్రశ్నించగా...., వాస్తవానికి మన వృద్ధి పనితీరు కొద్దికాలంగా బలహీనంగా ఉందని, 2016 నోట్ల రద్దు తర్వాత ఆర్థికాభివృద్ధి ఎన్నడు పటిష్ఠంగా కోలుకోలేదన్నారు రాజన్. అధిక ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం... ఈ మూడు భారత్ను వేధిస్తున్న సమస్యలు అన్నారు. రష్యా-ఉక్రెయిన్ ఉదంతం నేపథ్యంలో వీటిని అదుపు చేయడానికి జాగ్రత్తగా చర్యలు చేపట్టాలన్నారు.
ధరలపై ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గ్లోబల్ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడిందని, ఇది భారత్లో ధరలపై ప్రభావం చూపుతుందని, దీనిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని రాజన్ అన్నారు. ద్రవ్యోల్భణంపై పోరులో కేంద్ర బ్యాంకు లేదా ప్రభుత్వానికి మైనస్ అన్నారు. ఏ సెంట్రల్ బ్యాంకు అయినా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని గౌరవించడం చాలా ముఖ్యమన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్థిక ఆందోళనలు తగ్గించేలా వడ్డీ రేట్లు పెంచకుండా, మితమైన ద్రవ్యోల్భణం కలిగి ఉందన్నారు. ద్రవ్యోల్భణాన్ని 4 శాతంగా ఉంచాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
విద్యార్థులు మెడికల్ డిగ్రీ కోసం మన దేశాన్ని విడిచి పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందని, మేథో సంపత్తిని ఎందుకు బయటి దేశాలకు వెళ్లేలా చేస్తున్నామని, ఈ మేథో మూలధనాన్ని మనం నిలుపుకోలేమా, ఈ అంశాలపై దృష్టి సారించాలన్నారు.
పీఎల్ఐ స్కీం గురించి మాట్లాడుతూ... ఈ స్కీం వల్ల పెద్ద కంపెనీలకు ఎందుకు సబ్సిడీ ఇవ్వాలని ప్రశ్నించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదన్నారు. రష్యా కచ్చితంగా ఎనర్జీ ఎగుమతిలో ముందు ఉన్నదని, నికెల్, పల్లాడియం, నియోన్, జినాన్, ఎరువులు వంటి వాటిని ఎగుమతి చేస్తుందని కాబట్టి ప్రభావం చూపుతుందన్నారు.